● రూ.31.50 లక్షల విలువైన
బంగారం, వెండి ఆభరణాలు మాయం
● వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లి సరికి
దొంగతనం
కొత్తపేట: వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి వచ్చే లోపు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరపడి, బీరువాలో భద్రపరచిన బంగారం, వెండి వస్తువులు దోచుకుపోయారు. ఎస్సై జి.సురేంద్ర శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆర్ఎస్ నగర్లో నివాసం ఉంటున్న చెల్లిబోయిన రాంబాబు ఈ నెల 18వ తేదీ రాత్రి తన భార్యతో కలిసి హాస్పిటల్ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. తిరిగి 20వ తేదీన ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చే సరికి తలుపు పగలగొట్టిఉంది. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని బంగారం, వెండి వస్తువులు కనిపించలేదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.30 లక్షలు, వెండి వస్తువులు సుమారు రూ.1.50 లక్షలు ఉంటాయని అంచనా. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ పరిశీలించారు.


