రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రాలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయని, వైఎస్సార్ సీపీలో చేరికలను అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే..రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధి 40వ డివిజన్ కృష్ణానగర్లో జరిగే కార్యక్రమానికి మార్గాని భరత్రామ్, మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యక్రమానికి తరలివెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకుడు కొల్లి నాని 300 మంది అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరుతున్న ఈ కార్యక్రమం నిర్వహణకు అనుమతి లేదంటూ వీరిని ఆపేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులకు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్గాని భరత్ రామ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని జీపు ఎక్కించి తరలించే ప్రయత్నం చేయడంతో నాయకులు, కార్యకర్తలు జీపును అడ్డుకుని రోడ్డు బైఠాయించారు. భరత్రామ్ను అక్కడ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం పార్టీ కార్యాలయంలో వదలిపెట్టారు. చేరికల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో జీపు పైనుంచి కొల్లి నాని మెడలో భరత్ రామ్ వైఎస్సార్ సీపీ కండువా వేసి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పార్టీలో చేర్చుకున్నారు.
పోలీసులే దాడికి దిగడం దారుణం
భరత్రామ్ మాట్లాడుతూ చేరికల కార్యక్రమాన్ని అడ్డుకుని వైఎస్సార్ సీపీ నాయకులపై పోలీసులే దాడి కి దిగడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. 307 సెక్షన్ కింద కేసు నమోదైన 10 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులే తమపై దాడికి ఉసిగొలిపారని, ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన ఘటన ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరకుండా అడ్డుకోవడానికి పోలీసులే ప్రయత్నించడం అభ్యంతరకరమన్నారు. పది మంది టీడీపీ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ముందుగానే చెప్పామని, అయినా సిటీ ఎమ్మెల్యే పోలీసులను అడ్డుపెట్టుకుని వారిని వైఎస్సార్ సీపీ నాయకులపైకి రెచ్చగొట్టి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని తాము ఎట్టి పరిస్థితులోనూ వదిలేది లేదని, కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా రాజమహేంద్రవరానికి ఇంకా వచ్చినట్టుగా కనిపించడం లేదన్నారు.
ప్రజాస్వామ్య విరుద్ధం
రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగాల్సిన కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయించేందుకు చేరికల కార్యక్రమంలో విధ్వంసం జరిగేలా అధికార పార్టీ నాయకులు, పోలీసులతో కలసి హైడ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మా ట్లాడుతూ వైఎస్సార్ సీపీకి, మాజీ ముఖ్యమంత్రి జగన్కు లభిస్తున్న విశేష ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, పార్టీ నాయకులు గుర్రం గౌతమ్, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, పీతా రామకృష్ణ, మార్గాని సురేష్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరికలను
అడ్డుకోవడం దారుణం
కూటమి ప్రభుత్వానికి
రోజులు దగ్గర పడ్డాయి
పోలీసులు తీరు సరికాదు
మాజీ ఎంపీ భరత్రామ్ ఆగ్రహం


