● పోలీసుల అదుపులో ఐదుగురు మహిళలు
● వివరాలు వెల్లడించిన సీఐ శ్రీనివాసరావు
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ రెండు, మూడు నంబర్ల ప్లాట్ఫారాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళల నుంచి రైల్వే పోలీసులు బుధవారం 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం రైల్వే జీఆర్పీ సీఐ శ్రీనివాసరావు బుధవారం విలేకర్లకు ఈ వివరాలు తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి గంజాయి రవాణా అవుతుందనే సమాచారం మేరకు రైల్వే పోలీసులు ప్లాట్ఫారాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు మహిళల వద్ద ప్లాస్టిగ్ బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గమనించి వారిని అదుపులోనికి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. గంజాయితో పట్టుబడిన మహిళలను నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన దేవరకొండ దుర్గమ్మ, పీతల మరియ్యమ్మ, గోగుల వీరమ్మ, బాణాల మార్తమ్మ, బందిపాటి సరసుగా గుర్తించారు. ఒడిశాలోని రాయగడ సమీపంలోని టిక్రి గ్రామంలోని ఒక వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసిన్నట్లు మహిళలు తెలిపారన్నారు. అరెస్టు చేసిన మహిళలను విజయవాడ రైల్వే కోర్టులో హాజరుపరుస్తామన్నారు.


