● అనాథలకు అందని సాయం
● అరకొరగా నిధులు విడుదల
● పెండింగ్లో 15 వేల దరఖాస్తులు
● ప్రభుత్వాల నిర్వాకంతో
అందని లబ్ధి
సాక్షి, రాజమహేంద్రవరం: అరకొర నిధులు విదులుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొందరు అనాథులపైనా వాత్సల్యం చూపుతున్నారు. వివిధ కారణాలతో అనాథలుగా మారుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘మిషన్ వాత్సల్య’ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమ లబ్ధి కోసం వేలాది మంది ఎదురుచూస్తుండడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో అమలయ్యే ఈ పథకాన్ని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ), ఐసీడీఎస్ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ పథకంపై పెద్దస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది.
అభాగ్యులకు అంతంతమాత్రంగానే అండ
తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్ల లోపు అనాథ పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. 2022లో కేంద్ర ప్రభుత్వంలోని ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పాబ్) ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో లబ్ధిదారులకు నెలకు రూ.4 వేలు చొప్పున అందించాల్సి ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది అర్హులు ఈ పథకంపై అవగాహన లేక లబ్ధిని కోల్పోతున్నారు. అవగాహన ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసి మిగిలిన వారిని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో వారి వయో పరిమితి దాటిపోయి లబ్ధి పొందలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. తర్వాత కొత్త దరఖాస్తులను రెండో ప్రాధ్యానం కింద స్వీకరిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లా పరిధిలో సుమారు 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
సామాజిక మాధ్యమాల
ప్రచారంతో దరఖాస్తుల వెల్లువ
సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వేల మంది అర్హులు నిరీక్షిస్తున్నారు. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసేవారు. గతంలోని నిబంధనల మేరకు అనాథలు, సెమీ ఆర్ఫాన్స్ (తల్లి లేదా తండ్రి మాత్రమే జీవించి ఉన్నవారు), హెచ్ఐవీ బాధితుల పిల్లలు ఈ పథకానికి అర్హులు. మరోవైపు విడాకులు తీసుకున్న జంటల పిల్లలు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందంటూ పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో ఆయా వర్గాల నుంచి భారీగా దరఖాస్తులు ఇచ్చేందుకు వేచి ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే లబ్ధిదారుల ఖాతాల్లో ఒక ఏడాదికి సంబంధించి ఒకేసారి నగదు జమ అవుతుంది. ఎన్ని నెలల పాటు ఈ సహాయం అందుతుందనేది కేంద్రం విడుదల చేసే నిబంధనలు, నిధులపై ఆధారపడి ఉంటుంది.
సంవత్సరం ఆర్ఫాన్స్ సెమీ హెచ్ఐవీ ఇతరులు మొత్తం
2023–24 110 225 19 14 368
2024–25 110 225 19 14 368
2025–26 263 623 47 19 952


