రాజమహేంద్రవరం సిటీ: నగరంలో వరుసగా జరుగుతున్న నేరాలు, ఘోరాలతో ప్రజలు భీతిల్లుతున్నారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 15 రోజుల వ్యవధిలో మూడు హత్యలు జరిగాయని, ఒక మెడికోను కారుతో గుద్ది చంపేయడం, రెండు చోట్ల బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదన్నారు. నగరంలో శాంతిభద్రతలు దిగజారడానికి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, పోలీసు వ్యవస్థ ఉదాసీనత కారణాలని భరత్ ధ్వజమెత్తారు. ఇన్నీసుపేట పోలమాంబ అమ్మవారి జాతరలో యర్రా గణేష్ అలియాస్ గంజిని, గోరక్షణ పేటలో చెవ్వేటి బుజ్జిని దారుణంగా హతమార్చారని, క్వారీ మార్కెట్ సెంటర్లో మార్తి నూకరాజు అనే యువకుడిపై విచక్షణా రహితంగా బ్లేడుతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, తాజాగా కోటిలింగాల పేటకు చెందిన యువతిని అభిలాష్ అనే వ్యక్తి కాతేరు గామన్ వంతెన వద్దకు తీసుకుని వెళ్లి సర్జికల్ బ్లేడుతో గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడన్నారు. రాత్రయ్యే సరికి కొందరు మద్యం, గంజాయి తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారంటే వారి వెనుక ఉన్న అదృశ్య రాజకీయ శక్తులు ఎవరనేది పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా వినియోగిస్తుండడం వల్లే ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. యువత సైతం ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయ పార్టీల నాయకులు వారిని అవసరాల కోసం వాడుకుని కేసుల్లో ఇరుక్కున్న తరువాత తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ దురాగతాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్లో ఇబ్బందులు తప్పవని భరత్రామ్ హెచ్చరించారు.
వరుస నేరాలతో నగర ప్రజలు బెంబేలు
గాడి తప్పిన శాంతిభద్రతలు
బ్లేడ్, గంజాయి బ్యాచ్ల వీరంగం
కఠిన చర్యలకు
వెనుకాడుతున్న పోలీసులు
మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్


