● వైఎస్సార్ సీపీ శ్రేణులు
అప్రమత్తంగా ఉండాలి
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్
సత్తి సూర్యనారాయణరెడ్డి
అనపర్తి: ‘సర్’లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లతోనే ఈ తతంగం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వ ఒత్తిళ్ల వల్ల అనేక చోట్ల లోపాలు జరుగుతున్నాయన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్లు, సానుభూతిపరులు ఉన్నప్పటికీ ఈవీఎంల సహకారంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. దీనిపై పరకాల ప్రభాకర్ వంటి ప్రముఖులు ఆధారాలతో విశ్లేషిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈవీఎం ట్యాంపరింగ్ కుదరదని గ్రహించిన కూటమి ప్రభుత్వం, ఓట్ల తొలగింపు రూపంలో కొత్త తరహా మోసాలకు పాల్పడుతోందని సూర్యనారాయణరెడ్డి మండిపడ్డారు. దానికి ఉదాహరణగా కూతుకులూరు గ్రామంలోని బూత్ నెంబర్ 45లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, తటస్థులకు చెందిన సుమారు 60 మంది ఓట్లను తొలగించారని, ఆఖరికి వైఎస్సార్ సీపీ గ్రామ కన్వీనర్ చిర్ల వీరవెంకటరెడ్డి(రమణ) సతీమణి శైలజ ఓటు కూడా తొలగించారంటే అధికారులపై కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లు ఏ రకంగా ఉన్నాయో తెలుస్తోందన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెలాఖరులోగా అక్రమంగా తొలగించిన ప్రతి ఓటును తిరిగి నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క ఓటూ గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పునరుద్ఘాటించారు.


