మోతుగూడెం: విద్యుత్ స్తంభాలపై మరమ్మతులు నిర్వహిస్తుండగా షాక్ కొట్టడంతో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక పవర్ హౌస్ నుంచి పొల్లూరు సబ్ స్టేషన్ వరకు 33 కేవీ విద్యుత్ స్తంభాల మరమ్మతులను మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్థానిక ఏపీ జెన్కో ఉద్యోగులతో పాటు సుమారు ఎనిమిది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆ పనిలో పాల్గొన్నారు. వారిలో మడివి ముత్తయ్య అనే కార్మికుడు పోల్ ఎక్కి రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఒక్కసారి కింద పడి మృతి చెందాడు. అతడితో పాటు మరో కాంట్రాక్ట్ కార్మికుడు నవీన్, ఏపీ జెన్కో ఉద్యోగి షేక్ రంజాన్ వలీకి చిన్నపాటి గాయాలు అయ్యాయి. వారిని ఏపీ జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మృతుడి బంధువుల ఆందోళన
కాంట్రాక్ట్ కార్మికుడు ముత్తయ్య మృతి చెందడంతో సీఐటీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకట్, మృతుడి కుటుంబ సభ్యులు, నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ముత్తయ్య మృతి చెందాడని, కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబంలో ఒకరికి జెన్కోలో ఉద్యోగంతో పాటు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారితో ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ రాజారావు, ఎస్ఈ బాలకృష్ణ, చిన్న కామేశ్వరరావు, ఇతర అధికారులు చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి రూ.27 లక్షల ఎక్స్గ్రే
షియా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి రావాల్సిన అన్ని సౌకర్యాలు అందజేస్తామని, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ కార్మికుడిగా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు. మోతుగూడెం ఎస్సై కృష్ణ, డొంకరాయి ఎస్సై చరణ్ నాయక్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
మరో ఇద్దరికి గాయాలు
స్తంభంపై మరమ్మతులు
చేస్తుండగా ప్రమాదం
అధికారుల నిర్లక్ష్యమే కారణమని
బంధువుల ఆందోళన


