● దులీప్ ట్రోఫీకి సాయితేజ,
మేనేజర్గా నాగ గంగాధర్ ఎంపిక
● హర్షం వ్యక్తంచేసిన క్రీడాభిమానులు
నాగమల్లితోట జంక్షన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన ఆంధ్ర రంజీ క్రికెటర్ కావూరి సాయి తేజ ప్రతిష్టాత్మక ‘దులీప్ ట్రోఫీ’కి ఎంపికయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఆటగాడు దిలీప్ ట్రోఫీకి ఎంపిక కావడం ఉభయ గోదావరి జిల్లాల క్రికెట్కు గర్వకారణమని క్రీడాభిమానులు అంటున్నారు. పిఠాపురానికి చెందిన కె.నాగ గంగాధర్ దిలీప్ ట్రోఫీ మేనేజర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ సాయి తేజ దిలీప్ ట్రోఫీకి ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు.
హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలు
అనపర్తి: మండల కేంద్రమైన బిక్కవోలు సత్తెమ్మపేటలో జమ్ము పార్యతి అనే వివాహిత పై 2025లో జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్టు ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ మంగళవారం తెలిపారు. తన వలలో పడలేదన్న అక్కసుతో పార్వతిని చంపాలనే ఉద్దేశంతో నిందితుడు మంత్రి అప్పలనాయుడు కత్తితో దారుణంగా దాడిచేసి గాయపరిచిన ఘటనపై ఎస్సై రవిచంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. అతడిని 2025 జనవరి 24న అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. కేసు విచారణానంతరం రామచంద్రపురం 13వ జిల్లా కోర్టు జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి ముద్దాయికి పై శిక్ష విధించారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.సునీల్కుమార్ తన వాదనలు వినిపించారు. సాక్షులను కోర్టులో హాజరు పరిచి కేసును పర్యవేక్షించిన బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ను, కోర్టు ప్రక్రియను పర్యవేక్షించిన హెడ్ కానిస్టేబుల్ కేవీ రాఘవులును ఉన్నతాధికారులు అభినందించారు.
మత్స్యకారుడి గల్లంతు
కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేటకు చెందిన మత్స్యకారుడు ఓసుపల్లి అనిల్కుమార్ (26) సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనిల్కుమార్ మరో ఐదుగురు చేపల వేట నిమిత్తం ఈ నెల 2న సముద్రంలోకి వెళ్లి తిరిగి వాకలపూడి ఫిషింగ్ హార్బర్కు వస్తుండగా సోమవారం మధ్యాహ్నం అనిల్కుమార్ సముద్రంలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. బోటు వెనక భాగంలో ఇంజిన్ నడిపేందుకు బల్లపై కూర్చున్న అతడి కోసం తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వారికి దొరక్కపోవడంతో గ్రామానికి చేరుకుని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. మత్స్యకారుడు కొవ్విరి నాగబాబు ఫిర్యాదు మేరకు ఏఎస్సై పట్నాయక్ కేసు నమోదు చేశారు. అనిల్కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో సూర్యారావు పేటలో విషాదం అలముకుంది.


