● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన
● చర్చకు పిలుస్తుంటే రాజకీయాలు
మాట్లాడుతున్నారని ఎద్దేవా
రాజమహేంద్రవరం రూరల్: బలహీన వర్గాల సంక్షేమంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో బలహీన వర్గాలకు విస్తృతంగా మేలు జరిగిందని, ప్రస్తుతం విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో బీసీలు నష్టపోతున్నారని తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
బలహీన వర్గాల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. బీసీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన మేలును నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా తమ పనితీరును ప్రజల ముందు వివరించాలని సవాల్ విసిరారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి స్పందిస్తూ బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్ సీపీకి లేదని మాట్లాడుతున్నారని, బలహీన వర్గాలకు ఎవరు మంచి చేశారో చర్చకు వస్తే ప్రజలే నిర్ణయిస్తారని వేణుగోపాలకృష్ణ తెలిపారు. దానిని పక్కన పెట్టి తాను సుబ్బారెడ్డికి నమస్కారం పెట్టిన విషయం పైన, జోగి రమేష్ కుటుంబ వ్యవహారం పైన, సీదిరి అప్పలరాజు కుమారుడి యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. బీసీల సమస్యలపై చర్చకు రమ్మంటుంటే చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోందన్నారు. బలహీన వర్గాల ప్రయోజనాలను పణం పెట్టి.. బీసీ నాయకులు మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారన్నారు. అన్యాయంగా పెడుతున్న కేసులకు ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయని వేణు స్పష్టంచేశారు.


