బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ అన్నారు. స్థానిక సూర్య కళామందిరంలో శుక్రవారం రాత్రి ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో 26వ తెలుగు రాష్ట్రాల సాంఘిక నాటక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను చిన్నతనంలో సూర్య కళామందిర్ లో నాటక ప్రదర్శన జరుగుతుందంటే చూసేందుకు వచ్చేవాడినని, అప్పట్లో హాలంతా ప్రేక్షకులతో నిండిపోయేదన్నారు. సీతారామరాజు కళావేదిక అధ్యక్షులు తల్లి కర్రి అచ్యుత రామారెడ్డి, కార్యదర్శి పంపిన దయానందబాబు మాట్లాడుతూ అల్లూరి పేరున ఏర్పాటు చేసిన సంస్థలు 26 ఏళ్లుగా నాటిక పోటీలను నిర్విరామంగా నిర్వహిస్తున్నాయన్నారు. అనంతరం ప్రముఖ మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డికి అల్లూరి విశిష్ట సేవా పురస్కారం అందించారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు, శ్రీకాకుళం సుమిత్ర కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకర శర్మకు ప్రతిభా విశిష్ట కళారంగ పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం నాటిక ప్రదర్శించారు. కార్యక్రమంలో కళావేదిక ఉపాధ్యక్షుడు బాపిరాజు, కోశాధికారి పీవీ శాస్త్రి పాల్గొన్నారు.


