బాబూయ్‌ రచ్చ | - | Sakshi
Sakshi News home page

బాబూయ్‌ రచ్చ

Aug 22 2025 4:41 AM | Updated on Aug 22 2025 4:41 AM

బాబూయ

బాబూయ్‌ రచ్చ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నమ్మించి దగా చేయడంలో చంద్రబాబు మాస్టర్‌ డిగ్రీ చేశారు. అది ప్రజలైనా, పార్టీ కోసం పనిచేసే నాయకులైనా, అందరినీ ఒకే గాటన కడతారు. ఎన్నికల్లో సేవలను వినియోగించుకుని గద్దెనెక్కాక కాలదన్నేయడంలో బాబును మించిన నాయకుడు లేడంటారు. అది అక్షరాలా నిజమని కాకినాడ రూరల్‌ నియోజకవర్గ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) తాజా ఎపిసోడ్‌తో స్పష్టమైంది. పార్టీ కాకినాడ రూరల్‌ మండల అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్తిబాబు వర్గం కాలా శ్రీనివాస్‌ను, వైరి వర్గం నుంచి కో కోఆర్డినేటర్‌ కటకంశెట్టి ప్రభాకర్‌(బాబి) వర్గం కాకరపల్లి చలపతిరావును తెరమీదకు తీసుకు రావడంతో బుధవారం పార్టీ పరిశీలకులు నల్లమిల్లి వీర్రెడ్డి, పి.సుధాకర్‌రెడ్డి సమక్షంలోనే కుమ్ములాడుకున్నాయి. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నిక చివరకు రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. గతంలో ఎప్పుడూ లేనిది పార్టీ మండల కమిటీ అధ్యక్షుడి ఎంపిక కోసం కటకంశెట్టి బాబి వర్గం సీల్డ్‌ కవర్‌ రాజకీయాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని సత్తిబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. సీనియర్‌ అయిన తనను, తన భార్యను ఇంతలా అవమానించడాన్ని తట్టుకోలేక మనస్తాపంతో సత్తిబాబు పార్టీ కోఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. తమకు, అనుచరులకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక, ఆత్మాభిమానం దెబ్బతిని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా గౌరవం దక్కకపోవడంతో పదవిని విడిచిపెట్టాల్సి వచ్చిందని సత్తిబాబు వెల్లడించారు. సత్తిబాబును బుజ్జగించేందుకు పార్టీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, తోట నవీన్‌ వంటి నాయకులు ప్రయత్నించారు. కానీ అప్పటికే కోఆర్డినేటర్‌ పదవికి సత్తిబాబు రాజీనామా చేసేశారు. ఇక చేసేదేమీ లేక వారు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని ముక్తాయించారు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల నుంచి సత్తిబాబు అధిష్టానంపై అసహనంతోనే ఉన్నారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ సీటును పొత్తు ధర్మానికి కట్టుబడి త్యాగం చేసిన పాపానికి సత్తిబాబుకు అతన్నే నమ్ముకుని టీడీపీ వెన్నంటే నిలిచిన అనుచర వర్గానికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. తమకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై గడచిన 14 నెలల కాలంలో అధినేత చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పర్యవేక్షించే నేతల వరకూ అందరి వద్ద నాలుగైదు పర్యాయాలు సాగిలపడినా అవమానాలే తప్ప ఆశాజనకమైన ప్రతి స్పందన కనిపించక పోవడాన్ని సత్తిబాబు వర్గం సీరియస్‌గా తీసుకుంది.

ఉదయం అక్కడ.. సాయంత్రం ఇక్కడ

అవమానాలపై సత్తిబాబు వర్గం ఉదయం ఆరోపణలకు దిగితే సాయంత్రానికి వైరి వర్గంగా ఉన్న కటకంశెట్టి బాబి అనుచరులు సత్తిబాబుపై ఎదురుదాడికి దిగడంతో టీడీపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రూరల్‌ మండల అధ్యక్ష పదవికి బాబి వర్గం ప్రతిపాదించిన కాకరపల్లి చలపతి సహా కముజు నెహ్రూ, గీశాల శ్రీనివాస్‌, గుడాల లోవరాజు, వాసంశెట్టి శ్రీనివాస్‌, తుమ్మల వెంకన్న తదితరులు మీడియా సమావేశంలో సత్తిబాబుపై అనేక ఆరోపణలు సంధించారు. 2024 ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వలేదని చంద్రబాబు, లోకేష్‌ ఫ్లెక్సీలు తగలబెట్టలేదా అని వారు నిలదీశారు. కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా పనికి ఆహార పథకంలో బియ్యం స్వాహా చేయడంపై కేసు నమోదు, తరచూ పార్టీపై అలక వహించడం, ఆనక ఇంట్లో కూర్చోవడం సత్తిబాబుకు ఆనవాయితీగా వస్తున్నదేనంటూ వారు తాజా ఎపిసోడ్‌ను కొట్టిపారేస్తున్నారు. సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేయడంతో టీడీపీలో ఇరువర్గాల మధ్య రాద్ధాంతం రావణకాష్టాన్ని తలపిస్తోంది.

పిల్లి సత్తిబాబు

కటకంశెట్టి బాబి

ఒక్క పదవీ దక్కలేదని..

ఎన్నికలై అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా తమ నాయకుడికి ఒక్కటంటే ఒక్క పదవి కూడా దక్కలేదని సత్తిబాబు అనుచరులు బాహాటంగానే ఆక్షేపిస్తున్నారు. పేరుకే కాకినాడ రూరల్‌ కోఆర్డినేటర్‌ అయినా ఆ స్థాయిలో అటు పార్టీలోనూ, ఇటు అధికారిక కార్యక్రమాల్లోనూ ప్రాతినిధ్యం దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పైనుంచి కింది వరకూ పొమ్మనకుండానే పొగబెడుతున్నారని ఆ వర్గంలో బలంగా నాటుకుపోయింది. లేదంటే పార్టీ కోఆర్డినేటర్‌గా నియోజకవర్గంలో 25 గ్రామాల్లో బూత్‌ కమిటీలు అన్నింటినీ పూర్తి చేసి రూరల్‌ మండల అధ్యక్షుడి నియామకానికి అడ్డుతగలడం ఏంటని సత్తిబాబు సహా ఆ వర్గం మండిపడుతోంది. రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కూడా సత్తిబాబు పనిలో పనిగా పలు విమర్శలు సంధించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక కనీసం పనుల్లో కూడా ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని సత్తిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా 50 శాతం పదవులు, పనులు తమ పార్టీ నేతలకు దక్కాల్సిందేనని అన్నారు. ఎన్నికల్లో తమ సేవలను వినియోగించుకుని అవసరం తీరిపోయాక కూరలో కరివేపాకులా తీసిపడేస్తారా అని సత్తిబాబు వర్గం నిలదీస్తోంది. జరుగుతున్న అవమానాలను చంద్రబాబు సహా జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుల వరకూ తీసుకువెళ్లినా బీసీ సామాజిక వర్గానికి చెందడంతో తొక్కేస్తున్నారనే ఆవేదనతో ఆ వర్గం కుతకుతలాడుతోంది.

ఫ టీడీపీలో ఆధిపత్య పోరు

ఫ రోడ్డెక్కిన నాయకుల కుమ్ములాట

ఫ కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌

పదవికి సత్తిబాబు రాజీనామా

ఫ ఇది మామూలే అంటున్న బాబీ వర్గం

బాబూయ్‌ రచ్చ1
1/1

బాబూయ్‌ రచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement