పేదలను కొట్టు.. పెద్దలకు పెట్టు | - | Sakshi
Sakshi News home page

పేదలను కొట్టు.. పెద్దలకు పెట్టు

Apr 28 2025 12:15 AM | Updated on Apr 28 2025 12:15 AM

పేదలను కొట్టు.. పెద్దలకు పెట్టు

పేదలను కొట్టు.. పెద్దలకు పెట్టు

ఇదీ కూటమి పాలన తీరు

దోమాడ బాధితులకు అండగా ఉంటాం

న్యాయం జరిగే వరకూ పోరాడతాం

వైఎస్సార్‌ సీపీ నేతలు వేణు, రాజా, సూర్యనారాయణరెడ్డి

పెదపూడి: పెద్దలను కొట్టి పేదలకు పెట్టాలనేది ఒకప్పటి మాట అయితే.. నేడు ప్రతి జిల్లాలోనూ పేదలను కొట్టి పెద్దలకు పెట్టు అనే విధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు. అరాచక పాలన సాగిస్తూ, ఎస్సీలను, బీసీలను అణగదొక్కుతూ, వారు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దోమాడ గ్రామంలో అధికారులు నాలుగు రోజుల క్రితం పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేశారు. ఇళ్లు కోల్పోయిన 8 మంది బాధిత కుటుంబాలను మాజీ మంత్రి వేణు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదివారం రాత్రి పరామర్శించారు. తొలగించిన ఇళ్ల శిథిలాలను పరిశీలించారు. ఇళ్ల తొలగింపు ఏవిధంగా జరిగిందో బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం సమకూర్చారు. ఈ మొత్తాన్ని ఆయా కుటుంబాలకు వేణు, రాజా చేతుల మీదుగా అందజేశారు.

కలెక్టర్‌ స్పందించాలి

ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, దోమాడలో ఎస్సీ, శెట్టిబలిజ, నాయీ బ్రాహ్మణులు, చేనేత తదితర పేద కుటుంబాలను రోడ్డున పడేసి, వారి పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారన్నారు. దోమాడలో కేవలం ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కోసం 70 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను అధికారులు తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసి, కేవలం రియల్‌ ఎస్టేట్‌ కోసం పని చేస్తోందని దుయ్యబట్టారు. బాధితులకు ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా, వారికి చెప్పకుండా తెల్లవారుజామున ఇళ్లు కూల్చివేయడం హేయమన్నారు. ఒక దివ్యాంగురాలు బాత్‌రూములో ఉండగా బయటకు లాక్కుని వచ్చి మరీ ఇల్లు కూల్చేశారన్నారు. మే 7న పెళ్లి చేసుకునే వారి ఇల్లు, హార్ట్‌ పేషెంట్‌ కుటుంబాల ఇల్లు కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్‌ స్పందించి, నిజనిర్ధారణ కమిటీ వేసి, విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు బాధితులను పరామర్శించడం స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకూ ప్రభుత్వం పైన, దౌర్జన్యంగా పని చేసిన అధికారుల పైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. నాలుగు రోజులుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి బాధితులకు అండగా ఉండి, అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేయడం అభినందనీయమని వేణు అన్నారు.

రియల్టర్ల కోసమే..

జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఇళ్ల తొలగింపు ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి వెనుక ఉన్న ఆరెకరాల రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కోసమే ఈ ఇళ్లను తొలగించారనే విషయం అర్థమవుతోందన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా ప్రొహిబిటెడ్‌ స్థలంలో ఉందని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు ఐదెకరాల్లో, పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ 10 ఎకరాల్లో ఇళ్లు కట్టుకోవచ్చుగానీ, 70 ఏళ్లుగా అక్కడే ఉంటున్న పేదలు పది గజాల్లో జీవించకూడదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి, ‘గతంలో మీరు చేసిన ఆరోపణ తేల్చండి’ అని బెదిరించడం, పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగడం వంటి వాటిపై పెట్టే దృష్టిని పేదల అభివృద్ధిపై పెట్టాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి హితవు పలికారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనే పేరు తొలగించుకుని, తెలుగుదేశం రియల్‌ ఎస్టేట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అని పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అమరావతి నుంచి దోమాడ వరకూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్పందించి, బాధితులకు పరిహారం అందించి, న్యాయం చేయాలని రాజా కోరారు.

బాధితులను కనీసం పరామర్శించరా..?

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశాలు లేకుండా అధికారులు ఈ దౌర్జన్య కాండ చేయరని ఆరోపించారు. బీజేపీ ప్రధాని దేశ రక్షణకు యుద్ధం చేస్తూంటే, స్థానిక ఎమ్మెల్యే ఆయన ప్రయోజనం కోసం పేదల ఇళ్లు, ఆస్తులు నేలమట్టం చేయడానికి పని చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25న పెదపూడి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే వచ్చారని, ఇప్పుడు పెదపూడిలో బళ్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి కూడా బాధితుల వద్దకు కనీసంగా కూడా పరామర్శకు రాలేదని అన్నారు. తమ దీక్షను చూసి చిరునవ్వు నవ్వుకుంటూ రామేశ్వరం గ్రామం వెళ్లిపోయారని బాధితులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ నెల 25న మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాధితులు తన వద్దకు వచ్చి విషయం చెప్పలేదనడం సరికాదన్నారు. బాధితుల కష్టాల్లో ఉంటే వచ్చి పరామర్శించాలే తప్ప వారు మీ వద్దకు రావాలనడం సరైన విధానం కాదని హితవు పలికారు. భవిష్యత్తులో బాధిత కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ శవానికి లే అవుట్‌లో దహన సంస్కారాలు చేస్తామని హెచ్చరించారు. ఈ బెంగతో ఎవరికి ఏమైనా అయితే లే అవుట్‌ యజమాని, ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ గుత్తుల రమణ, పార్లమెంటరీ బీసీ సెల్‌ కన్వీనర్‌ కేతా శ్రీను, సర్పంచుల సమాఖ్య మండల అధ్యక్షుడు కోసూరి వాసు, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ కన్వీనర్‌ సాంబత్తుల చంటి, ఎంపీటీసీ సభ్యుడు పేపకాయల వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement