
అప్పు రాబట్టుకునేందుకు బాలుడి కిడ్నాప్
చాకచక్యంగా పట్టుకున్న కోరంగి పోలీసులు
తాళ్లరేవు: అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి రాబట్టేందుకు బాలుడిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కయిన వ్యక్తి ఉదంతమిది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని జి.వేమవరం గ్రామానికి చెందిన అయినవిల్లి కాళీకృష్ణ భగవాన్ రెండవ కుమారుడు ఫణివర్ధన్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యన్నారాయ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విచారణలో బాలుడు అదృశ్యం కాలేదని, కిడ్నాప్కు గురైనట్లుగా గుర్తించారు. బాలుడు తండ్రి కాళీకృష్ణ భగవాన్ మూడేళ్ల క్రితం చొల్లంగిపేట గ్రామానికి చెందిన కుంది అద్దాలు వద్ద రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ఆ డబ్బులు రాబట్టుకునేందుకు కాళీకృష్ణ భగవాన్ రెండవ కుమారుడైన ఫణివర్ధన్ను కిడ్నాప్ చేసి ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతంలో రెండు రోజులపాటు దాచాడు. అక్కడి నుంచి బాలుడు ఫణివర్ధన్ను చొల్లంగిపేటలోని తన స్వగృహానికి గురువారం తీసుకువచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా దాడిచేసి అతని బారినుంచి బాలుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్టు ఎస్సై తెలిపారు.