
లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వచ్చే నెల 10న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో ఆమె, ఆ సంస్థ కార్యదర్శి, ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి బి.పద్మలు లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం చర్చించారు. పెండింగ్లో ఉన్న ఆయా సంస్థల సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను గుర్తించి, ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాజీ పడదగిన అన్ని ఇతర కేసులనూ గుర్తించి, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో డీఆర్ఓ టి.సీతారామయ్య, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బీఎస్ఎం వలి, డిప్యూటీ కమిషనర్ ఎస్వీ రమణ, ప్రభుత్వ న్యాయవాది సీహెచ్వీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఫైనాన్సియర్లు
మ్యాపింగ్ చేసుకోవాలి
అమలాపురం రూరల్: వాహనాల క్రయ విక్రయాలతో ప్రమేయం ఉన్న ఫైనాన్సియర్లు రవాణాశాఖ ప్రస్తుత వాహన్ సాఫ్ట్వేర్లో మ్యాపింగ్ చేసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ ఇప్పటికే 60 శాతం ఫైనాన్సియర్ల మ్యాపింగ్ పూర్తయ్యిందని, మిగిలినవారు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.