
అంతర్వేది ఆలయంలో భక్తజన సందోహం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. కార్తిక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి పలువురు కుటుంబ సమేతంగా వచ్చారు. అలాగే అయ్యప్ప, భవానీ దీక్షాధారులు రావడంలో ఆలయం కిక్కిరిసింది. సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. సుమారు 15 వేల మంది భక్తులు వచ్చినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. భక్తులకు తాగునీరు అందించడంతో పాటు నిత్యాన్నదాన పథకంలో భోజన వసతి కల్పించారు.
కిక్కిరిసిన అయినవిల్లి క్షేత్రం
అయినవిల్లి: విఘ్నేశ్వరుని క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. పంచామృత, ప్రత్యేక అభిషేకాల్లో 158 మంది, స్వామివారి ప్రత్యేక దర్శనంలో 1,269 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 37 మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. అలాగే నూతన వాహన పూజలు, చిన్నారులకు నామకరణలు, అక్షరాభ్యాసాలు, నామకరణలు జరిగాయి. స్వామి వారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,17,793 ఆదాయం సమకూరింది.