ఫ 57,902 మంది ఓటర్లకు నోటీసులు
ఫ వచ్చే నెల 28లోగా ఆధారాలు చూపాలంటున్న అధికారులు
ఫ లేకుంటే ఆ ఓట్లు రద్దు
అంబాజీపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లావ్యాప్తంగా 1,514 పోలింగ్ బూత్లలో 12,11,266 మంది ఓటర్లున్నారు. వీరిలో 57,902 మంది ఓటర్ల దరఖాస్తులలో పలు లోపాలను అధికారులు గుర్తించారు. తగిన ధ్రువపత్రాలు లేకపోవడం, పేర్లలో తప్పులు, చిరునామా మార్పులు, ఆధార్ లోపాలు, రెండుచోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం, వలసల వంటి కారణాలతో వారికి బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ) నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారు వచ్చే నెల 28వ తేదీలోగా సంబంధిత ఆధారాలను తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలి. గడువులోగా స్పందించకపోతే వారి ఓటు హక్కుపై వేటు పడుతుందని అధికారులు చెబుతున్నారు. నోటీసులు అందుకున్న వారు ఆయా అధికారుల వద్దకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించడం వలన గందరగోళం తప్ప ప్రయోజనం ఉండదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దీనికి బదులు ఏఈఆర్ఓలతో కలసి బీఎల్ఓలే నేరుగా ఇళ్లకు వచ్చి విచారణ జరిపితే ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని పలువురు సూచిస్తున్నారు. అయితే, కార్యాలయాలకు రాలేని వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, గర్భిణులు తదితరుల ఇళ్లకు సంబంధిత ఏఈఆర్ఓ, బీఎల్ఓలు వెళ్లి తనిఖీ చేస్తారని అంబాజీపేట తహసీల్దార్ బి.చినబాబు తెలిపారు.
మండలాల వారీగా ఓటర్లకు ఇచ్చిన
నోటీసుల వివరాలు
రామచంద్రపురం అర్బన్ 123
రామచంద్రపురం రూరల్ 201
కాజులూరు 176
కె.గంగవరం 385
ముమ్మిడివరం రూరల్ 1,475
ముమ్మిడివరం అర్బన్ 406
కాట్రేనికోన 932
ఐ.పోలవరం 4,234
తాళ్లరేవు 96
అమలాపురం రూరల్ 3,189
అమలాపురం అర్బన్ 4,049
అల్లవరం 3,584
ఉప్పలగుప్తం 1,325
సఖినేటిపల్లి 707
మలికిపురం 5,933
రాజోలు 6,649
మామిడికుదురు 1,905
పి.గన్నవరం 734
అంబాజీపేట 611
అయినవిల్లి 1,713
ఆత్రేయపురం 4,318
రావులపాలెం 4,439
కొత్తపేట 5,505
ఆలమూరు 4,583


