ఏలూరులో ‘సాక్షి’ కార్యాలయంపై దాడి దారుణం
టీడీపీ గుండాల తీరుపై ఆగ్రహం
నిరసన తెలిపిన పాత్రికేయులు
సాక్షి, అమలాపురం: పత్రికలపైనా, మీడియా సంస్థలపై దాడులు జరగడం అనైతికమని, ఇది ముమ్మాటికీ ప్రశ్నించే గొంతుకను నొక్కివేయడమేనని వివిధ పాత్రికేయ సంఘాల సభ్యులు, ప్రెస్ క్లబ్ల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులోని సాక్షి పత్రిక కార్యాలయంపై టీడీపీకి చెందిన దుండగలు దాడి చేయడంపై కోనసీమ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనంతరం రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
● జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఐజేయూ సభ్యుడు మండెల నాగ వెంకట ప్రసాద్ (బాబీ), అమలాపురం ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కొండేపూడి సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్, ‘సాక్షి’ అమలాపురం స్టాఫ్ రిపోర్టర్ నిమ్మకాయల సతీష్ బాబు ఆధ్వర్యంలో వివిధ సంఘాలకు చెందిన పాత్రికేయులు ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సాక్షి కార్యాలయంపై దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని, పత్రికల స్వేచ్ఛను కాలరాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం అమలాపురం ఆర్డీవో కె.మాధవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు విజయ్, పరసా సుబ్బారావు, అరిగెల రుద్ర శ్రీనివాస్, కట్టా మురళీకృష్ణ, నల్లా విజయ్ పాల్గొన్నారు.
● రాజోలు నియోజకవర్గ పరిధిలో వివిధ పాత్రికేయ సంఘాలకు చెందిన ప్రతినిధులు సర్కిల్ ఇన్స్సెక్టర్ టి.నగేష్ కుమార్, రాజోలు తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్లకు వినతిపత్రాలు అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే రాజోలు నియోజకవర్గ అధ్యక్షుడు తోట సత్యనారాయణ (చంటి), ఉపాధ్యక్షుడు కె.సురేంద్ర, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్, కార్యదర్శి వీవీ నాగేశ్వరరావు, వీఎస్ఆర్ బాపూజీ పాల్గొన్నారు.
● పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేట మండలంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పాత్రికేయులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోశాధికారి మట్టపర్తి శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు సీఎన్ మూర్తి, తెలగరెడ్డి దుర్గా శంకర్, మట్టపర్తి రాములు పాల్గొన్నారు.
● మండపేట నియోకవర్గం పరిధిలో కపిలేశ్వరపురం మండల డిప్యూటీ తహసీల్దార్కు పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు. పాత్రికేయులు దేవ సహాయం, పి.లెనిన్ బాబు, చిట్టి కుమార్, శేఖర్ పాల్గొన్నారు.

పత్రికలపై దాడులు అనైతికం