సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో గోల్డ్ స్కాం కలకలం రేపుతోంది. సిద్ధేశ్వరి జ్యువెలర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తానని చెప్పిన నగల దుకాణం నిర్వహకుడు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు.
కష్టపడి కూడబెట్టిన సొమ్మును సంస్థలో పెట్టుబడిగా పెట్టామని.. ఇప్పుడు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం చేసి, బంగారం ఆభరణాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. పూర్తి స్థాయిలో బంగారం తిరిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని బాధితులు తేల్చి చెప్పారు.


