కరప: గ్రామదేవత ఉప్పాలమ్మ తల్లిని ఆదివారం శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వైస్ ఎంపీపీ పాట్నీడి సత్యభీమేశ్వరరావు(భీమన్న) సమకూర్చిన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, వేపకొమ్మలు, మామిడి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కరప పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉప్పాలమ్మను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిన్నారి మురళీకృష్ణ, గొర్రెల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు తదితర కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈనెల 29న పౌర్ణమి రోజున అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి, ఈ కాయకూరలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.


