తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత | Sakshi
Sakshi News home page

తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత

Published Fri, Dec 18 2020 7:16 PM

Two Injured In Ex Councillor Firing At Adilabad District Tatiguda - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని తాటిగూడలో తుపాకీ కాల్పులు కలకలం‌ రేపాయి. ఎంఐఎం ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ రివాల్వర్‌తో స్థానికులను బెంబేలెత్తించాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా పడ్డారు. ఫారూఖ్‌ రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బులెట్లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది. తొలుత ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీతో ఫారూఖ్‌ వీర విహారం చేశాడు. కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.


అదులోకి నిందితుడు
తాటిగూడలో కాల్పులకు సంబంధించి ఐజీ నాగిరెడ్డి స్పందించారు. నిందితుడు ఫారూఖ్ అహ్మద్‌ను అదులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఐజీ పేర్కొన్నారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఫారూఖ్ లైసెన్స్‌డ్‌ గన్‌తో కాల్పులు జరిపారని వెల్లడించారు. క్రికెట్ గేమ్ ఆడుతున్న వారి పిల్లల గొడవ కాల్పులకు దారితీసినట్టుగా తెలుస్తోందని నాగిరెడ్డి అన్నారు. ఫారూఖ్‌ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఇంచార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. గాడపడ్డవారికి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు.

Advertisement
Advertisement