ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ | Three Wives and Three Skeletons Panipat Police Solves Mystery | Sakshi
Sakshi News home page

ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ

Mar 26 2021 1:46 PM | Updated on Mar 26 2021 2:14 PM

Three Wives and Three Skeletons Panipat Police Solves Mystery - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మ్యాట్రిమోనియల్‌ సైట్ల ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిని మోసం చేసేవాడు

చండీగఢ్‌: కొద్ది రోజుల క్రితం హర్యానా పానిపట్‌లోని ఓ ఇంట్లో మూడు అస్థిపంజరాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పానిపట్‌ పోలీసులు నాలుగు రోజుల్లోనే ఈ మిస్టరీని చేధించారు. దీనికి సంబంధించి యూపీకి చెందిన అశాన్‌ సైఫీ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అసలు ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చింది అంటే నాలుగు రోజుల క్రితం సరోజ్‌ అనే మహిళ పానిపట్‌ శివ్‌ నగర్‌లో తాను గతంలో కొన్న ఇంటిని రెన్నోవేషన్‌ చేస్తుండగా మూడు అస్థిపంజరాలు బయపటడ్డాయి. సరోజ్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అశాన్‌ని అరెస్ట్‌ చేశారు. అతడు గతంలో ఈ ఇంటి ఓనర్‌. అశాన్‌ పవన్‌ అనే వ్యక్తికి తన ఇంటిని అమ్మాడు. ఆ తర్వాత 2017లో పవన్‌ వద్ద నుంచి సరోజ్‌ ఈ ఇంటిని కొనుగోలు చేసింది.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి పాత యజమానుల గురించి చట్టు పక్కల వారిని ప్రశ్నించగా.. అశాన్‌ ప్రవర్తన సరిగా ఉండేది కాదని తెలిపారు. దాంతో అతడి మీద అనుమానంతో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల క్రితం తానే ఈ ముగ్గురిని హత్య చేసి పానిపట్‌లోని తన పాత ఇంటిలో పూడ్చి పెట్టానని.. సరోజ్‌కు కనిపించిన అస్థి పంజరాలు అవేనని తెలిపాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే తన రెండో భార్య, ఆమె కుమారుడు.. మరో బంధువు 15 ఏళ్ల కుర్రాడు అని వెల్లడించాడు అశాన్‌. 

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘కార్పెంటర్‌గా పని చేసే అశాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేవాడు. మ్యాట్రిమోనియల్‌ సైట్ల ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిని మోసం చేసేవాడు. ఈ క్రమంలో అశాన్‌కు కొన్ని సంవత్సరాల క్రితం ముంబైకి చెందిన నజ్నీన్‌తో పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే అతడికి వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య, ఆమె సంతానం యూపీలో నివసిస్తుండేవారు. ఈ క్రమంలో అశాన్‌ తనకు పెళ్లి అయిందనే విషాయన్ని దాచి నజ్నీన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం అశాన్‌ పానిపట్‌కు తన మకాం మార్చాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు మొదటి భార్య వద్దకు వెళ్లి వస్తుండేవాడు’’ అని తెలిపారు పోలీసులు.

‘‘ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అశాన్‌ మొదటి వివాహం గురించి నజ్నీన్‌కు తెలిసింది. ఇక అప్పటి నుంచి ఆమె మొదటి భార్య వద్దకు వెళ్లనివ్వలేదు. దాంతో ఆగ్రహానికి గురైన అశాన్‌ రెండో భార్య, ఆమె కుమారుడు, మరో 15 ఏళ్ల పిల్లాడిని చంపాలని డిసైడ్‌ అయ్యాడు. వారికి విషం పెట్టాడు. మరణించిన అనంతరం వారిని పానిపట్‌లో తాను నివాసం ఉన్న ఇంట్లో పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత ఈ ఇంటిని పవన్‌కు అమ్మాడు. అనంతరం ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకుని ప్రస్తుతం యూపీ భదోహిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్థిపంజరాలు వెలుగు చూడటం.. ఇరుగుపొరుగు వారు చెప్పిన దాని ప్రకారం అశాన్‌ మీద అనుమానం రావడంతో యూపీ వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి’’ అని పోలీసులు తెలిపారు.

చదవండి:
‘దృశ్యం’ సీన్‌: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం
యువకుడిని రాడ్డుతో కొడుతూ చిత్ర హింసలు పెట్టి..

Advertisement
 
Advertisement
Advertisement