ఫ్లాట్‌లో బంధించి.. రాడ్డుతో కొడుతూ, చిత్ర హింసలు

Man And Woman Brutally Assaults Business Partner Gurgaon - Sakshi

గురుగ్రాం: ఓ యువకుడిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు నలుగురు వ్యక్తులు. ఫ్లాట్‌లో బంధించి రాడ్డుతో కొడుతూ చిత్ర హింసలకు గురిచేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. హర్యానాలోని గురుగ్రాంలో మార్చి 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. రోషన్‌, సందీప్‌ అనే ఇద్దరు యువకులు పెయింటింగ్‌ బిజినెస్‌ ప్రారంభించారు. అపార్టుమెంట్లు, ఇండ్లకు రంగులు వేయించే కాంట్రాక్టులు చేపట్టి డబ్బు సంపాదించారు. ఈ క్రమంలో వాటాల పంపకాల విషయంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా రోషన్‌ కోరడంతో సందీప్‌ అందుకు నిరాకరించాడు. 

అంతేగాక తన స్నేహితులు అంకుఖ్‌, ఖాజన్‌ సింగ్‌తో కలిసి రోషన్‌ను పలం విహార్‌లో గల తమ ఫ్లాట్‌కు తీసుకువచ్చాడు. వీరితో పాటు మరో మహిళ కూడా జతకలిసింది. అంతా కలిసి రోషన్‌ను తీవ్రంగా కొట్టారు. ‘‘ఈ భూమ్మీద నువ్వు ఎక్కడికి వెళ్లినా సరే, నీ జాడ కనిపెట్టి మరీ నిన్ను చితక్కొడతాం’’ అంటూ బెదిరిస్తూ హింసించారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా సందీప్‌ గ్యాంగ్‌ నుంచి తప్పించుకున్న రోషన్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో కోలుకున్న అనంతరం పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతడి ఫిర్యాదుతో సందీప్‌ సహా తన స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  

చదవండి: దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top