అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మృతదేహాన్ని రిక్షాలో తీసుకొచ్చిన కుటుంబం
ఫరీదాబాద్లో అమానవీయ ఘటన
ఫరీదాబాద్: ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులకు కనీసం గౌరవప్రదంగా ఇంటికి సాగనంపై భాగ్యంకూడా దక్కట్లేదు. టీబీ వ్యాధిలో మరణించిన 35 ఏళ్ల మహిళను ఇంటికి తరలించేందుకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అంబులెన్స్కు నిరాకరించడంతో గత్యంతరం లేక ఆ పేద కుటుంబం ఆమె మృతదేహాన్ని రిక్షాలో తరలించిన హృదయవిదారక ఘటన హరియాణాలోని ఫరీ దాబాద్లో జరిగింది.
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం అనురాధా దేవి అనే మహిళ గత ఆరునెలలుగా టీబీతో బాధపడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ సహా పలు ఆస్పత్రుల చుట్టూ తి రిగినా ఫలితం లేకుండాపోయింది. ఉన్న డబ్బంతా ఆస్పత్రుల ఫీజుల కోసం ఖర్చయి పోవడంతో చిల్లిగవ్వ లేక చివరకు బాద్షా ఖాన్ సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఆమె తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది.
సరూర్పూర్ గ్రామంలోని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ పంపాలని భర్త ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా ఎవరూ పట్టించుకోలేదు. చేతిలో డబ్బుల్లేక చివరకు పొరుగింటి వాళ్ల నుంచి కొంత అప్పు తీసుకొని ఒక రిక్షాను అద్దెకు తీసుకొచ్చి అందులోకి భార్య మృతదేహాన్ని ఎక్కించి 12 కిలోమీటర్ల దూరంలోని సొంతింటికి బయల్దేరారు. భర్త నడుస్తూ, కుమారుడు తల్లి మృతదేహాన్ని ఒక వస్త్రంతో కప్పి ఏడుస్తూ వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అయింది. ‘‘ అంబులెన్స్ ఇచ్చేదే లేదు.
సొంత ఏర్పాట్లు చేసుకో. బయటి వ్యక్తులకు 700 రూపాయలు ఇస్తే ఏదో ఒకటి ఏర్పాటుచేస్తారు’’ అని అంబులెన్స్ సిబ్బంది తెగేసి చెప్పారని భర్త ఝంఝున్ వాపోయా డు. పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో కనీస గౌరవం దక్కట్లేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఘటన పై బీకే సివిల్ ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ జయంత్ అహుజా స్పందించారు. ‘‘ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రామ్ భాగవత్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. బాధ్యులపై శాఖాపర చర్యలు తీసుకుంటాం’’ అని అహుజా ప్రకటించారు. ఘటనపై ఫరీదాబాద్ రెడ్క్రాస్ కార్యదర్వి బీజేంద్ర సౌరత్ మాట్లాడారు. ‘‘ఆస్పత్రుల్లో ఇలాంటి సేవలు ఉచితం. మాకు ఈ విషయంపై ఎలాంటి ఫోన్కాల్ రాలేదు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.


