మీదపడిన మృత్యువు 

Three People Died In Road Accident In Godavarikhani - Sakshi

రెండు లారీలు ఢీకొని.. ఒకటి ఆటోపై పడిన వైనం 

ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి..

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌ సమీపంలోని ఫ్‌లైఓవర్‌ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో 2 నెలల పసికందు ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ వైపు వెళ్లేందుకు గోదావరిఖని గంగానగర్‌ ఫ్‌లైఓవర్‌పైకి ఎక్కుతున్న బొగ్గు లోడు లారీని మంచిర్యాల వైపు వెళ్తున్న బూడిద లోడు లారీ అతి వేగంగా ఢీకొట్టింది.

దీంతో రెండు లారీలు రెండు పక్కలకు పడిపోయాయి. ఈ క్రమం లో మంచిర్యాల వైపు వెళ్తున్న లారీ.. పక్కనే ఆగి ఉన్న ఆటోపై పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ సహా 8 మందిలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను రామగుండం ముబారక్‌నగర్‌కు చెందిన షేక్‌ షకీల్‌ (28), భార్య షేక్‌రేష్మా (22), చిన్న కుమార్తె షేక్‌ సాధియా ఉమేరా (2 నెలలు)గా గుర్తించారు.

డ్రైవర్‌ రహీంబేగ్, షేక్‌హుస్సేన్, షేక్‌ షకీల్‌ పెద్ద కుమారుడు షేక్‌ షాకీర్, రెండో కూతురు షేక్‌షాదియా, తమ్ముడు తాజ్‌బాబా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంచిర్యాల జిల్లా ఇందారంలో జరిగే బంధువుల ఫంక్షన్‌ కోసం షకీల్‌ తన తండ్రి హుస్సేన్‌తో కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top