రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌ | Threatening calls to Rajasingh | Sakshi
Sakshi News home page

రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌

May 30 2024 4:23 AM | Updated on May 30 2024 5:52 AM

Threatening calls to Rajasingh

ఉగ్రవాదులకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌నంబర్‌ ఇచ్చానని గోషామహల్‌ ఎమ్మెల్యే వెల్లడి 

అబిడ్స్‌(హైదరాబాద్‌): గోషామహల్‌ ఎమ్మె ల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్‌కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్‌ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్‌ సోషల్‌ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్‌ నుంచి కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు.

కొన్నిసార్లు వాయిస్‌ మెసేజ్‌ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్‌లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్‌ వెల్లడించారు. బెదిరింపు కాల్స్‌ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్‌లో అన్వేషించి సీఎం రేవంత్‌రెడ్డి నంబర్‌ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. 

కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్‌ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్‌ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్‌ వస్తున్నందున సీఎం రేవంత్‌రెడ్డి నంబర్‌ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్‌ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్‌ ఇచ్చానంటూ రాజాసింగ్‌ వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement