
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటకు వెళ్లినప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుసరిస్తున్నవారు అభిమానులు కాదని పేర్కొన్నారు.
మూడు రోజులుగా ద్విచక్ర వాహనాలపైన, కారులోను పవన్కళ్యాణ్ను వెంబడించారని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్కళ్యాణ్ ఇంటివద్దకు వచ్చి గొడవ చేశారని, సెక్యూరిటీ సిబ్బంది నివారిం చబోగా దుర్భాషలాడుతూ గొడవకు దిగారని పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.