Shraddha Murder Case Updates: 5 Days Police Custody For Aaftab Narco Test - Sakshi
Sakshi News home page

శ్రద్ధ హత్యకేసు.. నిందితుడు అఫ్తాబ్‌కు ఐదు రోజుల పోలీస్ కస్టడీ.. నార్కో టెస్టుకు అనుమతి..

Published Thu, Nov 17 2022 6:46 PM

Shraddha Murder Case 5 Days Police Custody For Aaftab Narco Test - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు ఢిల్లీ సాకెత్ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అలాగే నార్కో టెస్టు నిర్వహించేందుకు కూడా అనుమతించింది. దీంతో ఢిల్లీ పోలీసులు అతడికి కీలకమైన నార్కో టెస్టు నిర్వహించనున్నారు.

అఫ్తాబ్‌ను గురువారం సాయంత్రం 4 గంటలకు కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు ఢిల్లీ పోలీసులు. అతనిపా దాడి జరిగే అవకాశం ఉన్నందున భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం కూడా ఈ కేసు సున్నితత్వాన్ని పరిగణననలోకి తీసుకుని వర్చువల్‌గా విచారించింది.

ఉరితీయాలని డిమాండ్‌..
అయితే విచారణ సమయంలో కోర్టు రూం బయట న్యాయవాదులు పదుల సంఖ్యలో గుమికూడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అఫ్తాబ్‌కు ఉరిశిక్ష విధించాలని వారంతా డిమాండ్ చేశారు.

డిల్లీ మెహ్రౌలీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రియుడు అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఒక్కో భాగాన్ని వేర్వేరుగా అడవిలో, ఇతర ప్రదేశాల్లో పడేశాడు. పోలీసులు కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అవి శ్రద్ధవో కాదో ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అలాగే మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన కత్తిని, శ్రద్ధ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మరో ఐదు రోజులు అఫ్తాబ్‌ను కస్టడీలో ఉంచాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది.
చదవండి: మూడు నెలల క్రితం తండ్రి మృతి.. తల్లి కాల్ రికార్డు విని కూతురు షాక్‌

Advertisement
Advertisement