రియల్టర్‌ దారుణ హత్య | Realtor Assassinated In Attapur Hyderabad | Sakshi
Sakshi News home page

రియల్టర్‌ దారుణ హత్య

Sep 10 2020 1:02 PM | Updated on Sep 10 2020 1:08 PM

Realtor Assassinated In Attapur Hyderabad - Sakshi

సాక్షి, అత్తాపూర్‌: భూతగాదాలతో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆశోకచక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన జావిద్‌(40) రియల్టర్‌గా ఉన్నాడు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులకు జావిద్‌కు గత కొంతకాలంగా ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలో మంగళవారం రాత్రి శివరాంపల్లి ప్రాంతానికి జావిద్‌ను భూమి విషయమై మాట్లాడుకుందామని రప్పించారు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఆవేశంలో సదరు వ్యక్తులు శివరాంపల్లి ప్రజాభవన్‌ వద్ద జావిద్‌ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి పరారైయ్యారు. దీంతో తీవ్రగాయాలైన జావిద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రెండు సెల్‌ఫోన్లు, ఐ–10 కారు, నంబరు లేని పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. సెల్‌ఫోన్‌ల కాల్‌ డేటాలను సైతం పరిశీలిస్తామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement