హెల్మెట్‌ పెట్రోల్‌ ట్యాంక్‌పై పెట్టి ప్రయాణం.. మృత్యు రూపంలో వచ్చిన మరో బైక్‌

Private College lecturer Deceased In Road Accident Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం (కొణిజర్ల): అనుకోని ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తల్లాడ మండలం రెడ్డిగూడెంకు చెందిన మోదుగు కృష్ణయ్య (44) రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. బండికున్న హెల్మెట్‌ ధరించి ఉంటే..బతికేవాడేమో అంటూ అయినవారు కన్నీరు పెడుతున్నారు. ఆదివారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో చిట్టీ డబ్బులు తీసుకుని తన బైక్‌పై..అత్తగారి ఊరు ముదిగొండ మండలం మేడేపల్లికి వెళ్తున్న క్రమంలో కొణిజర్ల ఏపీజీవీబీ వద్ద రోడ్డు దాటుతుండగా మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కృష్ణయ్య కింద పడిపోగా తల రోడ్డుకు గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డారు. అయితే..హెల్మెట్‌ ఉన్నప్పటికీ ధరించకుండా బండి ట్యాంక్‌పై ఉంచి ఖాళీగా వస్తున్నారు.

చదవండి: (స్వప్నతో నిషాంత్‌ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..) 

ఒకవేళ హెల్మెట్‌ పెట్టుకుని ఉంటే తల భాగం సురక్షితంగా ఉండేదని, మరణం సంభవించి ఉండేది కాదని పలువురు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటికే వైరా నుంచి ఖమ్మం వెళ్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమాదస్థలిలో ఆగి మానవత్వం చాటారు. కృష్ణయ్యతో పాటు గాయపడిన మరో ద్విచక్రవాహనదారుడు, కొణిజర్లకు చెందిన చింతల వీరేందర్‌ను తన ఎస్కార్ట్‌ వాహనంలో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఐదు నెలలుగా కృష్ణయ్య మేడేపల్లిలో ఉంటున్నారు. ఈ దుర్గటనతో మృతుడి భార్య అశ్విని, పిల్లలు మోజెస్‌బెన్నీ, సాత్విక కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంపై కొణిజర్ల ఎస్సై టీవై.రాజు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబంలో విషాదం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top