మహిళ కొంపముంచిన సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ | Police Helps To Women Who Bought Stolen Phone In Mumbai | Sakshi
Sakshi News home page

మహిళ కొంపముంచిన సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌

Nov 14 2020 2:31 PM | Updated on Nov 15 2020 9:06 AM

Police Helps To Women Who Bought Stolen Phone In Mumbai - Sakshi

సెల్‌ఫోన్‌ గిఫ్ట్‌గా ఇస్తున్న పోలీసు అధికారి

ముంబై : కుమారుడి ఆన్‌లైన్‌ చదువుల కోసం సెకండ్‌ హ్యాండ్‌లో సెల్‌ఫోన్‌ కొన్న ఓ తల్లి చిక్కుల్లో ఇరుక్కుంది. అది దొంగిలించిన ఫోన్‌ అవ్వటం కారణంగా ఓ రోజు మొత్తం పోలీస్‌ స్టేషన్‌లో ఉండాల్సి వచ్చింది. చివరకు పోలీసుల ఔదార్యంతో కష్టాలనుంచి గట్టెక్కగలిగింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, బోరివ్లీకి చెందిన స్వాతి సుభాష్‌ సావ్రే తన కొడుకు ఆన్‌లైన్‌ చదువుల నిమిత్తం కొద్దిరోజుల క్రితం 6 వేల రూపాయలు పెట్టి సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొన్నది. దాని రిపేర్ల కోసం మళ్లీ 1,500 రూపాయలు ఖర్చు చేసింది. అనంతరం అందులో సిమ్‌ వేసుకుని వాడటం మొదలుపెట్టింది. మరుసటి రోజు స్వాతి ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు.. అది దొంగిలించిన ఫోన్‌ అని చెప్పి, ఆమెను రైల్వే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ( సెల్ ‌ఫోన్‌ రీప్లేస్‌ చేయలేదని ఆవేదనతో..)

ఓ రోజు మొత్తం విచారించి దొంగతనంతో ఆమెకు సంబంధం లేదని గుర్తించి పంపేశారు. అయితే స్వాతి ఆ ఫోన్‌ను కొనడానికి దాదాపు మూడు నెలల పాటు కష్టపడాల్సి వచ్చింది. అంతేకాదు! కుమారుడి ఆన్‌లైన్‌ చదువు కూడా నిలబడిపోయే పరిస్థితి. స్వాతి పనిచేస్తున్న ఇంటి యజమానితో తన గోడును వెళ్లబోసుకుందామె. ఆ యజమాని ఈ విషయాన్ని ముంబై పోలీసులకు ట్వీట్‌ చేశాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. అనంతరం కుమారుడి చదువు కోసం ఆమెకు సెల్‌ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement