‘రియల్‌’ వేధింపులు.. రైతు అదృశ్యం.. ఆగిన తండ్రి గుండె | One Died in real estate traders | Sakshi
Sakshi News home page

‘రియల్‌’ వేధింపులు.. రైతు అదృశ్యం.. ఆగిన తండ్రి గుండె

Jul 11 2024 7:12 AM | Updated on Jul 11 2024 7:12 AM

One Died in real estate traders

దుండిగల్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వేధింపులకు తాళలేక ఓ రైతు అదృశ్యమయ్యాడు. బెంగపెట్టుకున్న అతడి తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ మున్సిపాలిటీ బౌరంపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బౌరంపేటకు చెందిన వంపుగూడెం కృష్ణారెడ్డి(72), సముద్రమ్మ భార్యాభర్తలు. వీరికి మాధవరెడ్డి, జైపాల్‌రెడ్డి సంతానం. ఈ కుటుంబానికి డి.పోచంపల్లిలోని సర్వే నెంబరు 188లో 1.13 ఎకరాల స్థలం ఉంది. దీనిని మాధవరెడ్డి సాగుచేస్తున్నాడు. వీరి స్థలం పక్కనే త్రిపుర ల్యాండ్‌మార్క్‌ సంస్థ ఇతర రైతుల నుంచి స్థలాలను కొనుగోలు చేసి వెంచర్‌ను నిరి్మస్తోంది.

మాధవరెడ్డితోపాటు మరో రైతు సురేందర్‌రెడ్డికి చెందిన భూములను సైతం తమకు విక్రయించాలని వెంచర్‌ నిర్వాహకులు పట్టుబట్టడంతో వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో మే నెలలో› ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. రైతులు, సంస్థ సిబ్బంది ఇచి్చన ఫిర్యాదుల మేరకు పరస్పర కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన రాత్రి మాధవరెడ్డి దుండిగల్‌ సీఐ శంకరయ్య పేరిట లెటర్‌ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి కుమారుడు వెళ్లిపోవడంతో ఆవేదన చెందిన కృష్ణారెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు.  

లెటర్‌లో ఏముందంటే..
‘త్రిపుర ల్యాండ్‌మార్క్‌ ఎండీ పసుపులేటి సుధాకర్, కార్పొరేటర్‌ మేకల వెంకటేశం, వంపుగూడెం సభ్యులను తీసుకువచ్చి నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఈ రోజు అందరు నన్ను అట్టి భూమి గురించి మళ్లీ పిలిపించుకుని బూతులు తిట్టారు. నేను మనస్తాపానికి గురై వెళ్లిపోతున్నాను. సార్‌.. నా పిల్లల్ని కాపాడండి.. పిల్లలు, అమ్మా నాన్న, భార్య నన్ను క్షమించండి’అంటూ సీఐ శంకరయ్యకు లేఖ రాశాడు. 

జైలుకు పంపారు..
దాడి చేయడమే కాకుండా తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి 14 రోజులు జైలుకు పంపారని, వారికి మాత్రం పోలీసులు స్టేషన్‌లోనే బెయిల్‌ ఇచ్చి పంపించేశారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఎండీ పసుపులేటి సుధాకర్, కార్పొరేటర్‌ మేకల వెంకటేశంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై దుండిగల్‌ సీఐ శంకరయ్యను ‘సాక్షి’వివరణ కోరగా రైతులు ఇచి్చన ఫిర్యాదుల ఆధారంగా 5, త్రిపుర ల్యాండ్‌ మార్క్‌సంస్థ సభ్యులు ఇచి్చన ఫిర్యాదుల ఆధారంగా 3 కేసులు నమోదు చేశామని, ఇద్దరు రైతులతోపాటు సంస్థకు చెందిన నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు. త్రిపుర ల్యాండ్‌ మార్క్‌సంస్థ ఎండీ సుధాకర్‌ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement