వృద్ధురాలిని హత్యచేసి.. సూట్‌కేస్‌లో కుక్కి.. | Old woman assassination in Nellore | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిని హత్యచేసి.. సూట్‌కేస్‌లో కుక్కి..

Nov 6 2024 4:26 AM | Updated on Nov 6 2024 4:26 AM

Old woman assassination in Nellore

నెల్లూరు నుంచి మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం 

చెన్నై మీంజూరు రైల్వేస్టేషన్‌లో పట్టుబడిన తండ్రి, కూతురు  

నిందితులను అరెస్ట్‌ చేసిన రైల్వే పోలీసులు   

నెల్లూరు (క్రైమ్‌)/తిరువళ్లూరు: పరిచయస్తురాలిని హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. పక్కరాష్ట్రంలో పడేసేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం కలిగించింది. నెల్లూరులో వృద్ధురాలిని హత్యచేసి మృతదేహాన్ని తమిళనాడులో పడేసేందుకు ప్రయత్నించారు. ఈ దుర్మార్గానికి సంబంధించి తండ్రీకుమార్తెలను పోలీ­సులు అరెస్టు చేశారు. 

పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు రాజేంద్ర­నగర్‌లో ఎం.రమణి (65), మురుగేశం దంపతులు ఉంటు­న్నారు. వీరికి నలుగురు పిల్లలు. రమణి సోమవారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి ఎంతకీ తిరిగిరాకపోవడంతో గాలించిన కుటుంబసభ్యులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. 

మీంజూరు రైల్వేస్టేషన్‌లో మృతదేహం 
సంతపేట ఇన్‌­స్పెక్టర్‌ మద్ది శ్రీనివాసరావు, ఎస్‌ఐ బాలకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సాంకేతి­కత ఆధా­రంగా గాలింపు చేపట్టారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూ­మ్‌­లో సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. 

ఆ సమయంలో తమిళ­నాడులోని మీంజూరు రైల్వే పోలీసులు సంతపేట ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌చేసి సూట్‌ కేసులో వృద్ధురాలి మృతదేహం ఉందని, ఆ సూట్‌ కేసును తీసుకొచ్చిన రా­జేంద్రనగర్‌కు చెందిన బాలసు­బ్ర­హ్మ­ణ్యం, అతని కుమార్తె తమ అదుపులో ఉన్నారని చెప్పారు. మృతదేహం ఫొటోను పంపించారు. మృతదేహం రమ­ణి­దిగా గుర్తించిన ఇక్కడి పోలీసులు రైల్వేపో­లీసు­లకు సమాచారమిచ్చారు. మీంజూరు రైల్వేపో­లీసు­ల విచారణలో రమణిని హత్యచేసినట్లు చెప్పా­రు.  

బంగారు ఆభరణాల కోసమే.. 
గతంలో రమణి ఇంటికి సమీపంలో ఉన్న బాల­సుబ్రహ్మణ్యం కుటుంబం ఇటీవల అదేప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రమణి ఒంటిపై ఆభరణాలు కాజే­యా­లని నిర్ణయించుకుని ఆమె కదలికలపై నిఘా ఉంచాడు. సోమవారం కూరగాయల కోసం వచ్చిన ఆమెతో మాట కలిపి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి ఒంటిపై ఉన్న సరుడు, నల్లపూసలదండ, కమ్మలు దోచుకున్నాడు.

రమణి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి ట్రావెల్‌ సూట్‌­కేస్‌లో కుక్కాడు. మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా పడేస్తే తెలిసిపోతుందని.. పొరుగునున్న తమిళనాడులో పడేయాలని నిర్ణ­యించుకుని కు­మార్తెకు చెప్పాడు. సాయంత్రం సుబ్రహ్మ­ణ్యం, కుమార్తెతో కలిసి నెల్లూరు సౌత్‌ రైల్వేస్టేషన్‌లో చెన్నై వెళ్లే ప్యాసింజర్‌ రైలు ఎక్కారు. 

చెన్నై మీంజూరు స్టేషన్‌లో రైలు ఆగడంతో.. దిగి నెల్లూరు వెళ్లే రైలెక్కి మార్గంమధ్యలో సూట్‌­కేస్‌ను బయట పడేయాలను­కున్నా­రు. రైలు కోసం వేచి ఉన్న సమయంలో అక్క­డి రైల్వే పోలీసులు విజిల్‌ వేయడంతో కంగారుపడి వెళుతుండగా ప్లాట్‌­ఫాంపై ఉన్న ఓ యువకుడు సూట్‌కేస్‌ను మరిచి­పోయారంటూ కేకలు వేశాడు. రైల్వే పోలీసులు వా­రి­ని ఆపి సూట్‌కేస్‌ గురించి ప్రశ్నించగా నీళ్లున­మలడం, భయపడడంతో వారికి అనుమానం వచ్చిం­ది. 

సూట్‌కేస్‌ నుంచి రక్తం కారు­తుండడంతో తెరచి చూశారు. మృతదేహం బయట­పడింది. దీంతో వారిని రైల్వే పోలీసులు విచారించగా బంగారు ఆభరణాల కోసమే హత్యచేసినట్లు చెప్పారు. కాగా, మృతదేహానికి పోస్టు­మార్టం నిర్వ­హించారు. çహత్య జరిగిన ప్రాంతం నెల్లూరు కావడంతో త్వరలోనే కేసును ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని అక్కడి పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement