Newly Married Couple Died In Road Accident In Prakasam, Details Inside - Sakshi
Sakshi News home page

Prakasam Road Accident: పెళ్లయిన రెండు నెలలకే నవ దంపతులు మృతి..

Nov 8 2022 10:02 AM | Updated on Nov 8 2022 11:06 AM

Newly Married Couple Died In Road Accident in Prakasam - Sakshi

ప్రకాశం: కోటి ఆశలతో ఏడు అడుగులు, వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన జంట వారి ఆశలు తీరకుండానే రోడ్డు ప్రమాదం కబళించింది. బాపట్ల జిల్లా జే పంగులూరు మండల పరిధిలోని రామకూరు గ్రామానికి చెందిన నవ దంపతులు మిన్నికంటి పవన్‌కుమార్‌ (30), మిన్నికంటి కళ్యాణి (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అందిన సమాచారం ప్రకారం రామకూరు గ్రామానికి చెందిన మిన్నికంటి సిద్దయ్య, పద్మావతికి కుమారుడు పవన్‌ కుమార్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. 

కుమార్తెకు ఆరేళ్ల క్రితమే వివాహం చేశారు. ఇంజినీరింగ్‌ చేసిన పవన్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల ఇంటి వద్దే ఉండి పనిచేస్తున్నాడు. గత ఆగస్టు నెలలో పవన్‌ కుమార్‌కి నరసరావుపేట దగ్గరలోని వడ్లమూడి గ్రామానికి చెందిన కళ్యాణితో వివాహమైంది. వీరి పెళ్లిని తల్లిదండ్రులు ఎంతో వైభవంగా చేసి మురిసిపోయారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో దంపతులు ఇద్దరూ టూవీలర్‌పై బొల్లాపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఉన్న హోటల్‌లో పుల్కా తిని, అనంతరం టీ స్టాల్‌లో టీ తాగి తిరిగి టూవీలర్‌ పై రామకూర వెళ్లేందుకు యూటర్న్‌ తీసుకుంటున్నారు. 

వెనక నుంచి వచ్చిన ప్రైవేటు ట్రావెల్‌ బస్సు టూవీలర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందగా, భార్య కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. సెంటర్‌కు వెళ్లి టిఫిన్‌ చేసి వస్తామని చెప్పి వెళ్లిన కుమారుడు, కోడలు తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలిసే సరికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దంపతుల మరణ వార్త వినగానే గ్రామం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement