కీలక డేటా తొలగించిన అనన్య! | NCB seizes laptop and mobile phone of Ananya Panday | Sakshi
Sakshi News home page

కీలక డేటా తొలగించిన అనన్య!

Oct 24 2021 4:55 AM | Updated on Oct 24 2021 10:52 AM

NCB seizes laptop and mobile phone of Ananya Panday - Sakshi

ముంబై:  దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరంలో క్రూయిజ్‌ నౌకలో పట్టుబడిన మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మిత్రురాలైన నటి అనన్య పాండేను విచారిస్తోంది. ఆమె నివాసం నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను ఎన్‌సీబీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.

ఇందులోని వాట్సాప్‌ చాటింగ్‌లు, ఫొటోలు, వాయిస్‌ నోట్లను ఆనన్య పాండే చాలావరకు తొలగించినట్లు ఎన్‌సీబీ గుర్తించింది. డిలీట్‌ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్యన్‌ ఖాన్‌తో ఆమె సాగించిన వాట్సాప్‌ చాటింగ్‌లలో కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల వివరాలు ఎన్‌సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీలు, ఆర్యన్‌ ఖాన్‌తో చాటింగ్‌లపై ఆనన్య పాండేను ఎన్‌సీబీ నిశితంగా ప్రశ్నించింది.

అయితే, ఆమె అన్నింటికీ ఒకటే సమాధానం చెబుతోంది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తనకు డ్రగ్స్‌ అలవాటు లేదని, డ్రగ్స్‌ కొనడానికి ఆర్యన్‌కు ఎలాంటి సాయం చేయలేదని, అతడితో ఆర్థిక లావాదేవీలు లేవని పేర్కొంటోంది. అయితే, ఆర్యన్‌ ఖాన్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసిన వ్యక్తులెవరో అనన్యకు తెలుసని ఎన్‌సీబీ అనుమానిస్తోంది. మరోవైపు డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది.

నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఆరా
ఆర్యన్‌ ఖాన్‌ సహా నిందితులందరి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థిస్తామన్నారు. ఈ కేసులో ఎన్‌సీబీ ఇప్పటిదాకా 20 మందిని అరెస్టు చేసింది. వారి ఆదాయ వనరులను పరిశీలిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement