లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Man Molested Married Woman  In Mancherial  - Sakshi

సాక్షి, పెంచికల్‌పేట్‌(ఆదిలాబాద్‌): ఇంటి పక్కన నివసించే వ్యక్తి లైంగిక వేధింపులకు వివాహిత బలైంది. పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసినా అతడి వేధింపులు ఆగకపోవడంతో భరించలేక శనివారం ఆత్మహత్య చేసుకుంది.ఎస్సై సిహెచ్‌.రమేష్‌ తెలిపిన వివరాలు.. ఎల్కపల్లి గ్రామానికి చెందిన జునుగరి శ్రీనివాస్‌కు 20ఏళ్ల క్రితం ఈస్‌గాం గ్రామానికి చెందిన సుజాత(35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. సుజాత ఇంటి పక్కనే ఉంటున్న రాచర్ల కృష్ణ గత మూడేళ్ల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు.

పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా తీరు మారలేదు. వేధింపులు భరించలేక రెండేళ్ల క్రితం స్థానిక పెంచికల్‌పేట్‌ పోలీసుస్టేషన్‌లో సుజాత తన భర్తతో కలిసి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణను అరెస్టు చేశారు. అయినా మళ్లీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తీవ్ర మనస్తాపం చెందిన సుజాత శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కారకుడైన కృష్ణను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. మృతురాలి తల్లి రాధాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.  

చదవండి: అప్పన్నకే శఠగోపం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top