కన్న తండ్రి కామాంధుడు.. తెలిసినవాడు మోసగాడు

Man Cheats Molestation Victim Girl In Karnataka - Sakshi

మైసూరు: కుమార్తెపై కన్నతండ్రి కామాంధుడై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ అభాగ్యురాలికి ప్రభుత్వం రూ. 5 లక్షల సహాయాన్ని అందజేస్తే ఒక మోసగాడు ఆ డబ్బును కొట్టేశాడు. ఇలా బాలిక ఇంటా బయటా దగా అయ్యింది.

ఈ దారుణం హుణసూరు తాలూకాలోని బల్లెనహళ్ళి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ మోసగాడు మాజీ గ్రామ పంచాయతీ సభ్యుని కొడుకైన చాంద్‌పాషా. 2019లో గ్రామంలో ఒక వ్యక్తి సొంత కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2020లో సంక్షేమ శాఖ ఆ బాలికకు రూ.5 లక్షల పరిహారాన్ని అందజేసింది.

నిరక్షరాస్యత ఆసరాగా
బాలికకు, తల్లి కి చదువు రాకపోవడంతో చాంద్‌పాషా వారి డబ్బును కొట్టేయాలని కుట్ర పన్నాడు. వారితో బ్యాంకు ఖాతాను తెరిపించి ఆ డబ్బులను అందులో జమ చేయించాడు. ఆ సమయంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలన్నీ తెలుసుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో బాలిక ఖాతాలో నుంచి రూ.2.50 లక్షలను తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు.

డెబిట్‌ కార్డు ద్వారా మిగతా డబ్బును స్వాహా చేశాడు. ఇటీవల తల్లీకూతురు డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లగా ఖాతా ఖాళీ అయ్యిందని చెప్పడంతో కంగుతిన్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మోసగాడు చాంద్‌పాషాను అరెస్టు చేశారు. డబ్బునంత తాను వాడుకున్నట్లు చెప్పాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top