అనుమానం పెనుభూతమై.. భార్యను హత్య చేసిన భర్త  

Man Assassinates His Wife At YSR Kadapa District - Sakshi

ఒంటిమిట్ట: అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చిన ఉదంతం శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంజీవరాయుడు తెలిపిన వివరాలు.. 2015లో షేక్‌రేష్మా(24)కు పెనగలూరు మండలం, నారాయణ నెల్లూరు గ్రామ వాసి అయిన షేక్‌ ఇస్మాయిల్‌తో వివాహమైంది. వీరికి తైబా తస్నిమ్, జైనబ్‌ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రేష్మాపై ఇస్మాయిల్‌ అనుమానం పెంచుకోవడంతో చాలా రోజులుగా వారి మధ్య కలతలు రేగాయి.

మూడు నెలల క్రితం రేష్మా తల్లిదండ్రులు షేక్‌ మహ్మద్‌ రఫీ, షేక్‌ అమ్ములు ఉంటున్న ఒంటిమిట్ట మండలం దిగువ వీధిలోకే వారు కూడా వచ్చి బాడుగ ఇంట్లో ఉంటున్నారు. అయినా వారిద్దరి మధ్య గొడవలు ఆగకపోగా ఎప్పటిలానే శుక్రవారం ఉదయం కూడా ఇంట్లో గొడవ పడ్డారు. ఆ సమయంలో క్షణికావేశానికి గురైన ఇస్మాయిల్‌ కత్తి తీసుకుని రేష్మా గొంతు కోసి పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న సీఐ రాజా ప్రభాకర్, ఎస్‌ఐ సంజీవరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని రేష్మా మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు ఇస్మాయిల్‌ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రేష్మా మృతి చెందడం, ఆమె భర్త  పరారీలో ఉండడంతో ఇద్దరు బిడ్డలు బిక్కుబిక్కుమంటూ ఉండడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top