ప్రేమజంట ఆత్మహత్య కలకలం.. ఊరి చివర చెట్టుకు వేలాడుతూ..

Lovers Suicide At Odisha - Sakshi

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువజంట.. బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.  గత మూడేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమంటూ ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. కాగా, సమాచారం అందుకున్న జరడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఐఐసీ అధికారి బాబానంద ప్రధాన్, బాధిత గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బరంపురం నగరానికి సమీపంలోని పత్రపూర్‌ బ్లాక్‌ జరడా పోలీసు స్టేషన్‌ పరిధిలో సమంతరాయ్‌పల్లి గ్రామానికి చెందిన సోను బెహరా(20), సునీత ప్రధాన్‌(18) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లగా.. వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సోను బెహరా గ్రామ శివారులోని మామిడి తోటలో చెట్టుకి సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

విషయం తెలుసుకున్న ప్రేమికురాలు సునీత ప్రధాన్‌ ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే, అక్కడే ఉన్న బాధిత కుంటుంబ సభ్యులు.. సునీతను తీవ్రంగా దూషించారు. దీంతో ఇంటికి వెళ్లిపోయిన ఆమె, కొద్ది సమయం తరువాత తిరిగి వచ్చి, పక్కనే ఉన్న మరో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జరడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రేమజంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ బాబానాంద తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top