ఛత్తీస్‌గఢ్‌లో జవాను కాల్పుల కలకలం | Jawan gunfire sensation in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో జవాను కాల్పుల కలకలం

Nov 9 2021 2:27 AM | Updated on Nov 9 2021 7:20 AM

Jawan gunfire sensation in Chhattisgarh - Sakshi

కాల్పులు జరిపిన జవాను రీతేశ్‌

న్యూఢిల్లీ/దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) జవాను జరిపిన కాల్పుల్లో నలుగురు తోటి జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మారాయిగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లింగన్‌పల్లి గ్రామంలోని సీఆర్‌పీఎఫ్‌ 50వ బెటాలియన్‌ సీ–కంపెనీ వద్ద సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కాగా, కాల్పులు జరిపిన జవాను రీతేశ్‌ రంజన్‌(25) తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, మానసిక సమతౌల్యం దెబ్బతినడంతో నిద్రిస్తున్న తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడని సీఆర్‌పీఎఫ్‌ సోమవారం స్పష్టంచేసింది. అతను 13వ తేదీ నుంచి సెలవుపై వెళ్లాల్సి ఉందని, ఆ తర్వాత బదిలీపై జమ్మూకశ్మీర్‌లోని మరో బెటాలియన్‌లో చేరాల్సి ఉందని తెలిపింది. అయితే, కాల్పుల ఘటనపై మరో వాదన వినిపిస్తోంది. ఈ బెటాలియన్‌లో బిహార్, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందిన జవాన్లు ఉన్నారు.

బిహార్‌ రాష్ట్రానికి చెందిన జవాన్ల మధ్య దీపావళి సెలవుల విషయమై వాగ్వాదం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామున జవాన్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. వెంటనే బిహార్‌కు చెందిన జవాను రీతేశ్‌ రంజన్‌ తన ఏకే–47 సర్వీస్‌ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. దీంతో బిహార్‌కు చెందిన రాజ్‌ మణి కుమార్‌ యాదవ్, ధాంజీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజీవ్‌ మోండల్, ధర్మేంద్ర కుమార్‌ మృతి చెందారు. కాల్పులు జరిపినపుడు అదే బ్యారక్‌లో దాదాపు 45 మంది జవాన్లు నిద్రిస్తున్నారు. కాల్పుల్లో మరో ముగ్గురికి బుల్లెట్ల గాయాలయ్యాయి.

వీరిని తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో వెంటనే సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో వారిని రాయ్‌పూర్‌ తరలించారు. కాల్పులకు పాల్పడిన రంజన్‌ను సీఆర్‌పీఎఫ్‌ అదుపులోకి తీసుకుంది. ఘటనపై మారాయిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి సీఆర్‌పీఎఫ్‌ ఆదేశించింది. ఘటనపై సీఎం భగేల్‌ విచారం వ్యక్తంచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement