గంజాయి మత్తులో యువకుల వీరంగం.. అడ్డుకోబోయిన మహిళపై..
సాక్షి,రహమత్నగర్(హైదరాబాద్): గంజాయి మత్తులో కొందరు తన భర్తపై దాడికి యత్నిస్తుండగా అడ్డుకున్న మహిళపై దాడి చేసి గాయపరచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్నగర్లో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం... రహమత్నగర్ పోలీస్ అవుట్ పోస్టు ఎదురుగా మైదానాన్ని ఆనుకుని ఉన్న రవియాదవ్గల్లీలో మహేశ్బాబు నివాసం ఉంది. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మైదానం నుంచి కొందరు యువకులు బయటికి వచ్చారు.
అప్పటికే గంజాయి మత్తులో ఉన్న వారు రవియాదవ్గల్లీలో నిలిపి ఉన్న మహేశ్బాబుకు చెందిన వాహనాన్ని బలంగా కొట్టారు. అక్కడే ఉన్న మహేశ్బాబు వారిని వారించబోగా అతనిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో తన భర్తపై జరుగుతున్న దాడికి అడ్డుకునేందుకు ఆయన భార్య సుమలత ప్రయత్నించింది. మత్తులో ఉన్న ఆ యువకులు ఆగ్రహంతో పక్కనే ఉన్న రాయితో సుమలతపై దాడి చేశారు. ఈ ఘటనలో సుమలత చేయి, కాలికి గాయాలయ్యాయి. దీంతో బాధితురాలు రహæమత్నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు