Medak Crime News Today: Man Killed For Extra Marital Affair In Medak - Sakshi
Sakshi News home page

భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి..

Jan 3 2022 11:40 AM | Updated on Jan 4 2022 8:37 AM

Extramarital Affair: Man Brutally Murdered In Medak - Sakshi

జోగిపేటలో వివరాలను వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాస్‌

సాక్షి, జోగిపేట(మెదక్‌): పాతకక్షలు, వివాహేతర సంబంధంతో హత్య చేసినట్లు.. ఒక గ్రామంలో హత్య చేసి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని మరో ఊరుకు తీసుకెళ్లి అక్కడ ఒక ఇంటికి మృతదేహాన్ని వేలాడదీసినట్లు విచారణలో తేలిందని పోతులబొగుడ హత్య గురించి పోలీసులు వివరించారు. ఆదివారం జోగిపేట సీఐ కార్యాలయంలో సీఐ శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

28 డిసెంబర్, 2021న వట్‌పల్లి మండలం గొర్రెకల్‌ గ్రామానికి చెందిన మల్కగోని అశోక్‌(26) హత్యకు గురయ్యాడు. కాగా అశోక్‌ అదే గ్రామానికి చెందిన బోడ అంబయ్య స్నేహితులు. ఈ నేపథ్యంలో అశోక్‌.. అంబయ్య భార్యతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. అదే గ్రామానికి చెందిన బోడ రాజు, ఉసిరికపల్లి రమేశ్, ఆత్కూరి నాగరాజులకు గొర్రెల వ్యాపారంలో అశోక్‌తో గొడవలు ఉన్నాయి. గణేశ్‌ నిమజ్జనం, బీరప్ప జాతర సమయంలో కూడా వీరి మధ్య గొడవలు జరిగాయి.

పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడని బోడ అంబయ్య... ప్రతి విషయంలో గొడవ పడుతున్నాడని రాజు, రమేశ్, నాగరాజు పగ పెంచుకున్నారు. నలుగురు కలిసి ఎలాగైనా అశోక్‌ను అంతం చేయాలని ప్లాన్‌ చేశారు.

డిసెంబర్‌ 28వ తేదీన రాత్రి అశోక్‌ తన రేకుల షెడ్డులో మద్యం సేవిస్తుండగా నలుగురు అక్కడికి వెళ్లారు.  అక్కడ గొడవపడి అశోక్‌ గొంతును టవల్‌తో బోడ అంబయ్య గట్టిగా బిగించగా, మిగిలిన వారు కదలకుండా కాళ్లు పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఊపిరాడక అశోక్‌ మృతి చెందాడు.  

నేరం నుంచి బయటపడేందుకు..
హత్య చేసిన తర్వాత నేరం నుంచి బయటపడేందుకు బోడ అంబయ్య తన భార్య సొంతూరైన పోతులబొగుడ గ్రామానికి రెండు బైక్‌లపై అశోక్‌ మృతదేహాన్ని తరలించారు. ఎవరికీ అనుమానం రాకుండా అంబయ్య అత్తగారి ఇంటి గోడకు మృతదేహాన్ని వేలాడదీశారు. అక్కడి నుంచి ఎవరికంట పడకుండా ఎవరింటికి వారు వెళ్లిపోయారు. సోదరుడి హత్యపై మల్కగోని మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

సీసీ ఫుటేజీల ఆధారంగా, నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను గొర్రెకల్‌ గ్రామంలో అదుపులోకి తీసుకొని విచారించడంతో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం జోగిపేట కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వట్‌పల్లి ఎస్‌ఐ దశరథ్, పుల్కల్‌ ఎస్‌ఐ నాగలక్ష్మి, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement