వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య

Extra Marital Affair: Wife Kills Husband With Lover In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిందో భార్య.. రుద్రూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రుద్రూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టి (40)కి ధర్మాబాద్‌ బాలాపూర్‌కు చెందిన సావిత్రితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.  వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ పనులు చేసే జెఎస్సీ కాలనీకి చెందిన బట్టు శ్రీనివాస్‌తో సావిత్రికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం ఇటీవల సావిత్రి భర్త పోశెట్టికి తెలియడంతో భార్యతో ఘర్షణ పడ్డాడు. చెడు అలవాటు మానుకోవాలని హితవు చెప్పాడు. సావిత్రి బుద్ధి మార్చుకోనందున తరుచు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సావిత్రి తల్లి చంద్రభాగ ఇటీవల రుద్రూర్‌ వచ్చింది. కూతురుతో తరుచూ గొడవ పడుతున్న పోశెట్టిని తప్పించాలని తల్లికూతుళ్లు శ్రీనివాస్‌ను ప్రేరేపించారు. దీంతో ఈ నెల 2న పోశెట్టిని ఇంటి నుంచి శ్రీనివాస్‌ బైక్‌పై తీసుకుని వెళ్లాడు. కల్లు దుకాణంలో  కల్లు తాగించాడు.

అనంతరం మద్యం షాపులో మందు తీసుకొని నక్కల ఒర్రెకు వెళ్లారు. అక్కడ పోశెట్టికి పూటుగా మద్యం తాగించి చెరువు బ్యాక్‌ వాటర్‌ ఒర్రెలోకి తోసేశాడు. చనిపోయాడని నిర్దారించుకుని ఇంటికి వెళ్లి సావిత్రికి ఫోన్‌ ద్వారా తెలియజేశాడు. అనంతరం సావిత్రి ఏమి తెలియనట్లు నటించింది. రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తే సమాధానం దాట వేసింది. చివరకు సోమవారం పోలీస్‌స్టేష్‌న్‌లో తనభర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన ఎస్సై రవీందర్‌ దర్యాప్తు చేయగా శ్రీనివాస్‌తో సావిత్రికి ఉన్న సంబంధం బయటపడింది. శ్రీనివాస్‌ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటన స్థలికి మంగళవారం రుద్రూర్‌ సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై రవీందర్‌ వెళ్లి మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీయించారు. మృతుడి భార్య సావిత్రి, అత్త చంద్రబాగ, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top