డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌ 

Dental doctor kidnapped In Rajendra Nagar - Sakshi

నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ వద్ద నుంచి తీసుకెళ్లిన దుండగులు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ సజ్జనార్‌

సాక్షి, రాజేంద్రనగర్‌/అత్తాపూర్‌: రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఓ డెంటల్‌ డాక్టర్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. కిస్మత్‌పూర్‌ ప్రాంతంలోని ప్రెస్టేజ్‌ విల్లాలో నివసిస్తున్న డాక్టర్‌ హుస్సేన్‌ (50) ఇదే ప్రాంతంలోని ఎక్సైజ్‌ పోలీస్‌ అకాడమీ పక్క కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పనులు పరిశీలించేందుకు తన కారులో డ్రైవర్‌తో కలిసి వచ్చాడు. అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న పనులను పరిశీలిస్తుండగా, బురఖా వేసుకున్న ఆరుగురు వ్యక్తులు అపార్ట్‌మెంట్‌ ప్రాంతానికి చేరుకున్నారు.  (సైకో డాక్టర్‌.. భార్య కాపురానికి రాలేదని..)

రెండవ అంతస్తులో కార్మికులతో మాట్లాడుతున్న హుస్సేన్‌ను బంధించి బలవంతంగా ఆయన కారులోనే తీసుకెళ్లారు. దీంతో డ్రైవర్, బిల్డింగ్‌లో పనిచేస్తున్న కార్మికులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. హుస్సేన్‌ కుటుంబ సభ్యులు 100 నంబర్‌కు ఫోన్‌ చేయడంతో పాటు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్, శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆశోకచక్రవర్తితో పాటు శంషాబాద్, మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను, వాహనం వెళ్లిన ప్రాంతాలలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. హుస్సేన్‌కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top