వీడని దళిత బాలిక కేసు మిస్టరీ..

Dalith Girl Assasination Tragedy In Nalgonda - Sakshi

సాక్షి, కేతేపల్లి(నల్లగొండ): మండలంలోని కొప్పోలులో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దళిత బాలిక కేసు మిస్టరీ వీడలేదు. బాలిక హత్యకు గురై వారం రోజులు కావొస్తున్నా కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని, నిందితులపై చర్యలు తీసుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. నల్లగొండలో ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చదువుతున్న ప్రీతి (17) ఘటన జరగడానికి మూడు రోజుల ముందు గ్రామానికి వచ్చింది.

ఈనెల 12న రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే నిద్రపోయిన బాలిక అర్ధరాత్రి తర్వాత కనిపించలేదు. 13న ఉదయం గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో బాలిక మృతదేహం కనిపించింది. ఆమె మెడచుట్టూ చున్నీ బిగించి లాగిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో కొన్నాళ్లుగా బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న అదే గ్రామానికి చెందిన యువకుడే ఆమెను బలవంతగా ఎత్తుకెళ్లి లైంగికదాడి  జరిపి హత్య చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

అయితే దీనిని పోలీసులు 174 సెక్షన్‌ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఆందోళలు చేశారు. బాలిక దారుణ హత్యకు గురైతే, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ నకిరేకల్‌తో పాటు కేతేపల్లిలో ధర్నాలు చేశారు. 

లైంగికదాడి, హత్యకేసుగా మార్పు..
పోలీసుల విచారణ తీరుపై నిరసనలు వ్యక్తం కావంతో జిల్లా పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. మొదట అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును లైంగికదాడి, హత్య కేసుగా మార్పు చేశారు. ఈ కేసులో స్థానిక పోలీసులపై ఆరోపణలు రావడంతో ఎస్పీ రంగనాథ్‌ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఎస్‌ఐ రామకృష్ణను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేసు పారదర్శక విచారణకు జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్, ఏఎïస్పీ సతీష్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు.

మృతదేహానికి రీపోస్టుమార్టం..
కొప్పోలు గ్రామంలో ఖననం చేసిన బాలిక మృతదేహాన్ని కేసు దర్యాప్తులో భాగంగా ఏఎస్పీ సతీష్, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో శనివా రం బయటికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహం నుంచి సేకరించిన అవశేషాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఈకేసు ఓకొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు అదుపులో నిందితులు..?
బాలిక హత్య ఘటనలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు యువకులకు ప్రమే యం ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అదే గ్రామానికి చెందిన అనుమానిత నిందితుడి ఫోన్‌కాల్స్‌ డేటా ఆధారంగా సూర్యాపేట మండలానికి చెందిన బ్యాండుమేళం వాయించే మరో ముగ్గురు యు వకులు ఈ ఘటనకు సహకరించినట్లు పోలీ సుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

ఘటన జరిగిన రెండో రోజే పోలీ సులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. బాలిక హత్యకు మాత్రమే గురైందా.. లేక సామూహిక లైంగికదాడి కూడా జరి గిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top