నాచారం దోపిడి, అత్యాయత్నం కేసు ముఠా అరెస్టు | CP Mahesh Bhagwat Arrested Nepali Gang In Nacharam Case In Hyderabad | Sakshi
Sakshi News home page

నేపాలీ ముఠా ఈ దోపిడికి పాల్పడింది: రాచకొండ సీపీ

Oct 26 2020 1:59 PM | Updated on Oct 26 2020 2:31 PM

CP Mahesh Bhagwat Arrested Nepali Gang In Nacharam Case In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వృద్దురాలికి మత్తు మందు ఇచ్చి దోపిడికి పాల్పడిన ముఠాను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అరెస్టు చేశారు. నేపాలీ గ్యాంగ్‌ ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19న నాచారం పోలీసుల స్టేషన్‌ పరిధిలో దోపిడీ, అత్యాయత్నం కేసు నమోదైనట్లు చెప్పారు. నేపాలీ గ్యాంగ్‌ ఇంట్లో మొదట పనిమనుషులుగా చేరి అదును చూసి దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు. ఈ ముఠాను పట్టుకునేందుకు 25 పోలీసు బృందాలతో మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ పంపి అరెస్టు చేశామన్నారు అయితే ఈ ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారన్నారు. గ్యాంగ్‌లోని అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి లక్ష తొంబై వేల నగదు, 9 తులాల బంగారం, గోల్డ్‌ లాకెట్‌, గోల్డ్‌ హారం, నిద్ర మాత్రలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

నాచారంలో ప్రదీప్‌ ఇంట్లో మొదట మాయ, అర్జున్‌లు‌ ఇద్దరూ భార్య భర్తలు అని చెప్పి ఇంట్లో పని మనుషులుగా చేరారని, ఈ నేపథ్యంలో 15 రోజులు పాటు ఇంట్లో పనులు కూడా చేశారన్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒంటరిగా ఉన్న వృద్దురాలికి మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న 10 లక్షల నగదుతో పాటు 9 తులాల బంగారు నగలు దొంగలించారన్నారు. అయితే ప్రదీప్‌ తన స్నేహితుడు పురుషోత్తంతో నేపాలీకి చెందిన వారే తన ఇంట్లో పని మనుషులుగా కావాలని చెప్పడంతో పురుషోత్తం డ్రైవర్‌ రాజు సహాయంతో మాయ, అర్జున్‌లను ప్రదీప్‌ ఇంట్లో పనిమనుషులుగా చేర్పించారని వెల్లడైందన్నారు. వారితో పాటు మరో ఇద్దరూ ఇక్కడికి వచ్చారని మొత్తం 8 మంది ఈ గ్యాంగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ముఠాకు చెందిన అయిదుగురిని అరెస్టు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement