ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి | Sakshi
Sakshi News home page

మహిళను వేధిస్తున్న కానిస్టేబుల్‌కు దేహశుద్ధి

Published Thu, Feb 18 2021 9:02 AM

Constable Arrested For Harassing Woman In Guntur District - Sakshi

తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి): రక్షించాల్సిన రక్షక భటుడే ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు. రెండురోజుల నుంచి ఆ మహిళ వెంట పడుతూ రోడ్డుపై వేధింపులకు గురిచేయడంతో, ఆ మహిళ బుధవారం జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు సదరు కానిస్టేబుల్‌కు దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను మాచవరం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న కానిస్టేబుల్‌ ఎం.శివరామకృష్ణ కొంతకాలంగా వెంబడిస్తూ, మాట్లాడాలంటూ వేధిస్తున్నాడు.

రెండు రోజుల క్రితం మహిళ విజయవాడ వెళ్లి వస్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న ఆటోను వెంబడించి, కుంచనపల్లిలోని ఆమె ఇంటి వరకు వచ్చాడు. బుధవారం ఉదయం అంగన్‌వాడీ స్కూల్‌ దగ్గర పిల్లలను వదిలిపెట్టేందుకు మహిళ వెళ్లగా, ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలంటూ రామకృష్ణ రోడ్డుపై ఆమెను అడ్డగించాడు. దీంతో ఆ మహిళ తన భర్తకు, బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చింది. ఘటనాస్థలానికి వచ్చిన బంధువులు శివరామకృష్ణను పట్టుకునేందుకు యత్నించగా అతడు బైక్‌తో వారిని గుద్దుకుంటూ పరారవ్వడానికి యత్నించాడు. మహిళ బంధువులు అతడిని వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసి, తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: అమ్మో పాము.. యువతి వాహనంపై వెళ్తుండగా..
పాతకక్షలు.. ఆస్పత్రిలో హత్య! 

Advertisement
Advertisement