సీఐడీ కేసును కొట్టేయండి 

Chintakayala Vijay petition in Andhra Pradesh High Court - Sakshi

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించండి 

హైకోర్టులో చింతకాయల విజయ్‌ పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య మంగళవారం విచారణ జరిపారు.

ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించారు. తదుపరి విచారణను 15కి వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. నకిలీ అశ్లీల వీడియోను సృష్టించి, టీడీపీకి చెందిన ఐ టీడీపీ గ్రూప్‌లో వ్యాప్తి చేసి తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు.

వాస్తవానికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ఫోన్‌ నంబర్‌ సాయంతో ఆ వీడియోను ఐ టీడీపీ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేశారని, దాంతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కేసులో విజయ్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్ధించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top