
నైగెర్ నది వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. పడవలో దాదాపు 85 మంది ప్రయాణించారని..
లాగోస్: వరదలతో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో వెళ్తున్న పడవ మునిగి 76 మంది దుర్మరణం చెందారు. ఈ విషాదం సంఘటన నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో జరిగింది. వరద నీటిలో పడవ మునకపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి. నైగెర్ నది వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. పడవలో దాదాపు 85 మంది ప్రయాణించారని, ఓవర్ లోడ్ కారణంగా మునిగిపోయినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.
‘రాష్ట్రంలోని ఓగుబరూ ప్రాంతంలో సుమారు 85 మందితో వెళ్తున్న పడవ వరదలతో ఉప్పొంగిన నదిలో మునిగిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మొత్తం 76 మంది మరణించినట్లు అత్యవసర సేవల విభాగం ధ్రువీకరించింది. బాధితులకు అత్యవసర సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.’ అని తెలిపారు అధ్యక్షుడు బుహారి. భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగినట్లు అత్యవసర విభాగం వెల్లడించింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కఠినంగా మారినట్లు తెలిపింది. సహాయ చర్యల కోసం నౌకాదళ హెలికాప్టర్ సాయం కోరామని పేర్కొంది.
ఇదీ చదవండి: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్తో ఆరుగురు మృతి