బాలికను వంచించి.. గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్‌.. | Sakshi
Sakshi News home page

బాలికను వంచించి.. గర్భవతిని చేసి.. అబార్షన్‌ అయ్యేందుకు మాత్రలు..

Published Sun, Jan 30 2022 7:30 AM

Auto Driver Molested on School Student in Anantapur District - Sakshi

సాక్షి, బుక్కరాయసముద్రం (అనంతపురం): పాఠశాలకు తన ఆటోలో వచ్చే బాలికపై ఓ ఆటో డ్రైవర్‌  కన్నేశాడు. మాయ మాయమాటలు చెప్పి మచ్చిక చేసుకున్నాడు. గర్భం దాల్చిన ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చింది. బుక్కరాయసముద్రం పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక అనంతపురం నగరంలోని ఓ పాఠశాలలో చదువుకుంటోంది. రేకులకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు ఆటోలో పాఠశాలకు వెళ్లి వచ్చేది. అప్పటికే పెళ్లయి ఇద్దరు సంతానమున్న రామాంజనేయులు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు.

చదవండి: (అర్ధరాత్రి పార్టీ.. మద్యం మత్తులో చిందులు.. నటులపై కేసు)

పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా... విషయం ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. అంతేకాకుండా అబార్షన్‌ అయ్యేందుకు మాత్రలు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 28న బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా...మార్గమధ్యంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో జరిగిన విషయాన్ని తల్లికి బాధితురాలు వివరించింది. అనంతరం బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా... విషయం తెలుసుకున్న పోలీసులు రామాంజనేయులుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

కఠిన చర్యలు తీసుకుంటాం 
బాలిక ప్రసవం కేసును సీరియస్‌గా పరిగణించాం. ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. త్వరలో నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతాం.  
– ప్రసాదరెడ్డి, అనంతపురం డీఎస్పీ   

Advertisement
Advertisement