నటి ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

Actor Chitra Husband Arrested In Chennai Over Her self Elimination - Sakshi

చెన్నై: నటి వీజే చిత్ర మృతి కేసులో ఆమె భర్త హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. చిత్ర మరణించిన నాటి నుంచి హేమనాథ్‌ సహా ఆమె సహ నటులు, సన్నిహితులను విచారించినట్లు తెలిపారు. సీరియల్‌లోని కొన్ని దృశ్యాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అదే ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు వెల్లడించారు. ‘‘టీవీలో చిత్ర నటించిన పలు సీన్ల గురించి హేమనాథ్‌ అభ్యంతరం తెలిపాడు. అదే రోజు ఆమె మృతిచెందింది. చిత్రను అతడు నెట్టివేయడంతో తీవ్ర వేదనకు గురైంది’’అని పేర్కొన్నారు. (చదవండి: చిత్రను హేమనాథ్‌ కొట్టి చంపేశాడు..)

కాగా ఓ ప్రైవేట్‌ చానెల్‌లో ప్రజెంటర్‌గా కెరీర్‌ ఆరంభించిన చిత్ర ‘పాండ్యన్‌ స్టోర్స్‌’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో హేమనాథ్‌ ఆమె జీవితంలో ప్రవేశించాడు. పెద్దల అంగీకారంతో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అయితే ముహుర్తానికి ముందే వీరు తమ రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు. ఈ క్రమంలో డిసెంబరు 10న తన షూటింగ్‌ అనంతరం భర్తతో కలిసి ఓ హోటల్‌కు చేరుకున్న చిత్ర తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో హేమనాథ్‌ తమ కూతురిని కొట్టి చిత్రహింసలకు గురిచేసి చంపేశాడని ఆమె తల్లి ఆరోపించారు. ఇదిలా ఉండగా.. పోస్టుమార్టం నివేదికలో చిత్రది ఆత్మహత్యే అని తేలింది. ఈ క్రమంలో చిత్ర బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించిన ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top